ఢిల్లీ: ఐపీఎల్లో భాగంగా సన్రైజర్స్ హైదరాబాద్తో జరుగుతున్న మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ 130 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచిన సన్రైజర్స్ హైదరాబాద్ ముందుగా ఢిల్లీని బ్యాటింగ్కు ఆహ్వానించింది. దాంతో బ్యాటింగ్కు దిగిన ఢిల్లీకి శుభారంభం లభించలేదు. ఓపెనర్లు పృథ్వీ షా(11), శిఖర్ ధావన్(12)లు ఆదిలోనే వికెట్లను చేజార్చుకున్నారు. దాంతో ఢిల్లీ 36 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత రిషభ్ పంత్(5) కూడా నిరాశపరిచాడు. కాగా, శ్రేయస్ అయ్యర్(43) రాణించడంతో ఢిల్లీ తేరుకుంది. చివర్లో అక్షర్ పటేల్(23 నాటౌట్), క్రిస్ మోరిస్(17) బ్యాట్ ఝుళిపించడంతో ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 129 పరుగులు చేసింది. సన్రైజర్స్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, నబీ, సిద్దార్థ్ కౌల్ఖ తలో రెండు వికెట్లు సాధించగా, రషీద్ ఖాన్, సందీప్ శర్మలు చెరో వికెట్ తీశారు.
అయ్యర్ మినహా..
ఢిల్లీ ఇన్నింగ్స్లో శ్రేయస్ అయ్యర్ మినహా ఎవరూ రాణించలేదు. ఫస్ట్ డౌన్లో వచ్చిన అయ్యర్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడగా, మరొక ఎండ్ నుంచి సహకారం లభించలేదు. వచ్చిన వారు వచ్చినట్లు పెవిలియన్ బాటపట్టడంతో ఢిల్లీ స్కోరు నత్తనడకన సాగింది. మరొకసారి మిడిల్ ఆర్డర్ విఫలమైంది. రిషబ్ పంత్, తెవాతియా, ఇన్గ్రామ్లు తీవ్రంగా నిరాశపరిచారు. దాంతో ఢిల్లీ స్కోరు వంద దాటడం కూడా కష్టమే అనిపించింది. అయితే చివర్లో అక్షర్ పటేల్ 1 ఫోర్, 2 సిక్సర్లతో 23 పరుగులు చేయడంతో ఢిల్లీ సాధారణ స్కోరును సన్రైజర్స్ ముందుంచింది.