సీఎస్‌కేపై డేర్‌డెవిల్స్‌ ప్రతీకారం

18 May, 2018 23:41 IST|Sakshi

ఢిల్లీ: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో భాగంగా చెన్నై సూపర్‌ కింగ్స్‌తో సొంత మైదానం ఫిరోజ్‌ షా కోట్ల మైదానంలో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ 34 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఢిల్లీ 163 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకుని గెలుపును అందుకుంది. సీఎస్‌కే ఆటగాళ్లలో అంబటి రాయుడు(50;29 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లు), జడేజా( 26 నాటౌట్‌) మినహా ఎవరూ రాణించకపోవడంతో చెన్నై 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 128 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది. ఫలితంగా ఇరు జట్ల మధ్య జరిగిన తొలి మ్యాచ్‌లో ఎదురైన ఓటమికి ఢిల్లీ ప్రతీకారం తీర్చుకుంది. ఇప్పటికే ప్లే ఆఫ్‌ రేసు నుంచి నిష్ర్కమించిన ఢిల్లీ బౌలింగ్‌లో ఆకట్టుకుని సీఎస్‌కేను కట్టడి చేసింది.

అంతకుముందు ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసింది. పృథ్వీ షా(17),శ్రేయస్‌ అయ్యర్‌(19), మ్యాక్స్‌వెల్‌(5), అభిషేక్‌ శర్మ(2)లు నిరాశపరచగా, రిషబ్‌ పంత్‌(38) ఫర్వాలేదనిపించాడు. చివర్లో విజయ్‌ శంకర్‌(36 నాటౌట్; 28 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు‌), హర్షల్‌ పటేల్‌(36 నాటౌట్;16 బంతుల్లో 1ఫోర్‌, 4 సిక్సర్లు‌) బ్యాట్‌ ఝుళిపించడంతో ఢిల్లీ గౌరవప్రదమైన స్కోరు సాధించింది.

మరిన్ని వార్తలు