రాణించిన ఉన్ముక్ చంద్ :ఫైనల్కు ఢిల్లీ

26 Dec, 2015 16:21 IST|Sakshi
రాణించిన ఉన్ముక్ చంద్ :ఫైనల్కు ఢిల్లీ

బెంగళూరు: విజయ్ హజారే వన్డే ట్రోఫీలో ఢిల్లీ ఫైనల్ కు చేరింది. శనివారం ఇక్కడ చిన్నస్వామి స్టేడియంలో హిమాచల్ ప్రదేశ్ తో జరిగిన తొలి సెమీ ఫైనల్లో ఢిల్లీ ఆరు వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించి ఫైనల్లోకి ప్రవేశించింది. హిమాచల్ ప్రదేశ్ నిర్దేశించిన 201 పరుగుల లక్ష్యాన్ని 41.0 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి ఢిల్లీ ఛేదించింది. ఢిల్లీ ఓపెనర్లలో శిఖర్ ధవన్(39), రిషబ్ పాంట్(18)లు కాస్త ఫర్వాలేదనిపించగా, అనంతరం ఉన్ముక్ చంద్(80 నాటౌట్) హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. ఉన్ముక్ కు నితీష్ రానా(19 నాటౌట్) చక్కటి సహకారం అందించడంతో ఢిల్లీ సునాయాసంగా ఫైనల్ కు చేరుకుంది. ఢిల్లీ  మిగతా ఆటగాళ్లలో కెప్టెన్ గౌతం గంభీర్(16), మిలంద్ కుమార్(10)లు నిరాశపరిచారు.


అంతకుముందు టాస్ గెలిచిన ఢిల్లీ.. హిమాచల్ ప్రదేశ్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. దీంతో  బ్యాటింగ్ చేపట్టిన హిమాచల్ ప్రదేశ్ 50. 0 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 200 పరుగులు మాత్రమే చేయగల్గింది. హిమాచల్ ప్రదేశ్ ఆటగాళ్లలో ప్రశాంత్ చోప్రా(33), దోగ్రా(28),కెప్టెన్ బిపుల్ శర్మ(51)లు ఓ మోస్తరుగా రాణించారు. ఢిల్లీ బౌలర్లలో రానా, నేగీ,భాటీలకు తలో రెండు వికెట్లు లభించగా, ఇషాంత్ శర్మ,సైనీలకు చెరో వికెట్ దక్కింది.

మరిన్ని వార్తలు