ఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10లో భాగంగా శనివారం కింగ్స్ పంజాబ్ తో జరుగుతున్న మ్యాచ్ లో ఢిల్లీ డేర్ డెవిల్స్ 189 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ ఆది నుంచి దూకుడుగా ఆడింది. ఢిల్లీ ఓపెనర్లలో శాంసన్(19) తొందరగా అవుటైనప్పటికీ, శ్యామ్ బిల్లింగ్స్(55;40 బంతుల్లో 9 ఫోర్లు) హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు.అయితే శాంసన్ తొలి వికెట్ గా అవుటైన స్వల్ప వ్యవధిలోనే కరుణ్ నాయర్ డకౌట్ గా పెవిలియన్ చేరాడు.
అనంతరం శ్రేయస్ అయ్యర్(22) ఫర్వాలేదనిపించడంతో ఢిల్లీ వేగం మళ్లీ పుంజుకుంది. చివర్లో కోరీ అండర్సన్(39 నాటౌట్;22 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లు), క్రిస్ మోరిస్(16), కమిన్స్(12 నాటౌట్; 6 బంతుల్లో 2 ఫోర్లు) లు బ్యాట్ ఝుళిపించడంతో ఢిల్లీ గౌరవప్రదమైన స్కోరు సాధించింది. ప్రధానంగా చివరి రెండు ఓవర్లలో 35 పరుగులను ఢిల్లీ స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. దాంతో నిర్ణీత ఓవర్లలో ఢిల్లీ ఆరు వికెట్లు కోల్పోయి 188 పరుగులు చేసింది.