బరిలో రహానే, అశ్విన్, కార్తీక్
విహారి,రోహిత్ రాయుడు, సిరాజ్లకూ చోటు
న్యూఢిల్లీ: ఉనికి చాటేందుకు అటు సీనియర్లకు, సత్తా నిరూపించుకునేందుకు ఇటు కుర్రాళ్లకు మరో అవకాశం. ఢిల్లీ వేదికగా మంగళవారం నుంచే దేవధర్ ట్రోఫీ వన్డే టోర్నీ. టీమిండియా వన్డే జట్టులోకి పునరాగమనం ఆశిస్తున్న అజింక్య రహానే, రవిచంద్రన్ అశ్విన్, దినేశ్ కార్తీక్లకు ఈ టోర్నీ కీలకంగా మారనుంది. దీంతోపాటు న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లనున్న భారత్ ‘ఎ’కు ఎంపికయ్యేందుకు కుర్రాళ్లకూ ఓ వేదిక కానుంది. మంగళవారం జరిగే తొలి లీగ్ మ్యాచ్లో భారత్ ‘ఎ’తో భారత్ ‘బి’ తలపడుతుంది.
ఈ టోర్నీలో భాగంగా ప్రతి జట్టు రెండేసి మ్యాచ్లు ఆడుతుంది. ఫైనల్ 27న జరుగుతుంది. అశ్విన్, పృథ్వీ షా, కరుణ్ నాయర్, కృనాల్ పాండ్యా, మొహమ్మద్ సిరాజ్లతో కూడిన భారత్ ‘ఎ’ జట్టుకు దినేశ్ కార్తీక్ సారథిగా వ్యవహరించనున్నాడు. శ్రేయస్ అయ్యర్ ఆధ్వర్యంలోని ‘బి’ జట్టులో మయాంక్ అగర్వాల్, హనుమ విహారి, రోహిత్ రాయుడు, దీపక్ చహర్లకు స్థానం దక్కింది. రహానే కెప్టెన్గా ఉన్న ‘సి’ జట్టులో సురేశ్ రైనా, అభినవ్ ముకుంద్, శుబ్మన్ గిల్, ఆర్. సమర్థ్, వాషింగ్టన్ సుందర్ తదితర ఆటగాళ్లున్నారు.