కివీస్ ‘ఎ’ 458/9 డిక్లేర్డ్
మౌంట్ మాంగనీ: న్యూజిలాండ్ ‘ఎ’తో తొలి అనధికారిక టెస్టులో భారత్ ‘ఎ’ బౌలర్లు మూడో రోజూ నిరాశపర్చారు. లోయరార్డర్లో క్లీవర్ (53), బ్రాస్వెల్ (48), జేమిసన్ (30), రాన్స్ (69 నాటౌట్) దూకుడుతో ఆతిథ్య జట్టు మొదటి ఇన్నింగ్స్ను 458/9 వద్ద డిక్లేర్ చేసింది. ఓవర్నైట్ స్కోరు 176/1తో ఆదివారం ఆట కొనసాగించిన న్యూజిలాండ్ ‘ఎ’ 35 పరుగుల వ్యవధిలో 4 వికెట్లు కోల్పోయి 211/5తో నిలిచింది. ఈ దశలో∙క్లీవర్, బ్రాస్వెల్ ఆదుకున్నారు. వీరిద్దరూ ఔటయ్యాక జేమిసన్, రాన్స్, టిక్నర్ భారత బౌలర్లను ఆడుకున్నారు. కృష్ణప్ప గౌతమ్ (3/107) మూడు వికెట్లు పడగొట్టాడు. 9 పరుగుల స్వల్ప ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ ‘ఎ’ ఆట ముగిసే సమయానికి వికెట్లేమీ కోల్పోకుండా 35 పరుగులు చేసింది. యువ ఓపెనర్ పృథ్వీ షా (26 బంతుల్లో 33 బ్యాటింగ్; 7 ఫోర్లు) ఎప్పటిలాగే బౌండరీలతో చెలరేగాడు. ఆటకు సోమవారం చివరి రోజు.