విరాట్ సేనకు కఠిన పరీక్ష

24 Mar, 2017 15:13 IST|Sakshi
విరాట్ సేనకు కఠిన పరీక్ష

ధర్మశాల: ఆస్ట్రేలియా-భారత జట్ల మధ్య జరుగుతున్న టెస్టు సిరీస్ తుది దశకు వచ్చేసింది. గవాస్కర్ -బోర్డర్ ట్రోఫీలో భాగంగా శనివారం నుంచి ధర్మశాలో ఆరంభమయ్యే నాల్గో టెస్టు ఈ సిరీస్లో చివరిది. హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో రేపు ఇరు జట్ల మధ్య ఉదయం గం.9.30 ని.లకు మ్యాచ్ ఆరంభం కానుంది. ఇప్పటివరకూ జరిగిన మూడు టెస్టుల్లో ఇరు జట్లు 1-1తో సమంగా నిలవడంతో చివరిదైన నాల్గో టెస్టు కీలకంగా మారింది. పుణెలో జరిగిన తొలి టెస్టులో ఆసీస్ గెలిస్తే, బెంగళూరులో జరిగిన రెండో టెస్టులో భారత్ విజయం సాధించింది. ఇక రాంచీలో ముగిసిన మూడో టెస్టు డ్రాగా ముగిసింది. ఈ మ్యాచ్లో భారత్ ను విజయం ఊరించినప్పటికీ చివరకు డ్రాతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ తరుణంలో సిరీస్ ఫలితం కోసం ధర్మశాల వైపు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.


ఆ రికార్డును సవరిస్తారా?


ఇదిలా ఉంచితే, ఈ వేదికపై జరిగిన ఆరంభపు వన్డే, ట్వంటీ మ్యాచ్లో భారత్ జట్టు ఓటమి పాలైంది. ఈ వేదికకు అంతర్జాతీయ హోదా వచ్చిన తరువాత 2013లో ఇంగ్లండ్ తో జరిగిన  తొలి మ్యాచ్ లో భారత్ ఏడు వికెట్ల తేడాతో పరాజయం చెందింది. ఆ తరువాత 2015లో ఇక్కడ జరిగిన తొలి ట్వంటి 20లో సైతం భారత్ కు నిరాశే ఎదురైంది. దక్షిణాఫ్రికాతో జరిగిన ఆ మ్యాచ్లో భారత్ ఏడు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఈ నేపథ్యంలో భారత్ ఆతిథ్యమిచ్చే 27వ టెస్టు వేదికైన ఈ స్టేడియంలో విరాట్ సేనకు కఠిన పరీక్ష ఎదురుకానుంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఈ టెస్టు గెలిచి రికార్డును భారత్ సవరిస్తుందా?లేక ఓటమి పాలై పాత కథనే పునరావృతం అనే దానిపై ఆసక్తి ఏర్పడింది.

 

మరొకవైపు ఇక్కడ సాధారణంగానే బౌన్సీ వికెట్ కు అనుకూలం కావడంతో  ఆసీస్ బౌలర్లు విజృంభించే అవకాశం ఉంది. అదే సమయంలో భారత జట్టు కూడా పేస్ బౌలింగ్ లో పటిష్టంగానే ఉంది. ఈ క్రమంలోనే తుది టెస్టులోఐదుగురు బౌలర్లతో బరిలోకి దిగి తమ బలాన్ని మరింత పెంచుకోవాలని భారత్ భావిస్తోంది. ఇదే జరిగితే కొన్ని రోజుల క్రితం టెస్టు జట్టులో చేరిన మొహ్మద్ షమీ తుది జట్టులో కచ్చితంగా ఉంటాడు.


ప్రతీకారం తీర్చుకుంటారా?


ఇరు జట్ల మధ్య చివరిసారి జరిగిన గవాస్కర్ -బోర్డర్ ట్రోఫీని ఆస్ట్రేలియా సొంతం చేసుకుంది.  2014-15 సీజన్లో స్వదేశంలో జరిగిన ట్రోఫీని ఆసీస్ 2-0తో సొంతం చేసుకుంది. మైకేల్ క్లార్క్ నేతృత్వంలోని ఆసీస్ జట్టు తొలి రెండు టెస్టులను గెలిచి సిరీస్ ను ఎగరేసుకుపోయింది. ఆ సిరీస్ లో స్టీవ్ స్మిత్ (769) అత్యధిక పరుగులు చేసి ఆసీస్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. మరి ఇప్పుడు జరుగుతున్న సిరీస్ ను భారత్ గెలుచుకుని ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది. మరొకవైపు భారత్ ను ఒత్తిడిలో నెట్టి సిరీస్ ను సొంతం చేసుకోవాలని ఆసీస్ యోచనగా ఉంది. దాంతో మరొకసారి రసవత్తర పోరు ఖాయంగా కనబడుతోంది.

మరిన్ని వార్తలు