కోల్కతా: భారత క్రికెట్ జట్టు తొలిసారి పింక్ బాల్ టెస్టుకు సిద్ధమైంది. శుక్రవారం బంగ్లాదేశ్తో ఈడెన్ గార్డెన్లో ఆరంభం కానున్న డే అండ్ నైట్ టెస్టులో టీమిండియా తలపడనుంది. అయితే పింక్ బాల్తో డే అండ్ నైట్ టెస్టుల అనుభవం లేని భారత జట్టు ఎంతవరకూ ఆకట్టుకుందనేది ప్రస్తుతం చర్చనీయాంశంంగా మారింది. బంగ్లాదేశ్తో జరిగిన తొలి టెస్టును ఇన్నింగ్స్ 130 తేడాతో గెలిచిన టీమిండియా.. పింక్ బాల్ టెస్టు ఎంత వరకూ రాణిస్తుందో అనే దానిపై ఫ్యాన్స్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా, తాజాగా పింక్ బాల్ టెస్టుకు సంబంధించి టీమిండియా వైస్ కెప్టెన్ అజింక్యా రహానే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన ఫోటో ఇప్పుడు వైరల్గా మారింది. రహానే బెడ్ పక్కనే పింక్ బంతిని పెట్టుకుని పడుకున్న ఫోటోను షేర్చేశాడు.
చారిత్రక పింక్ బాల్ టెస్టు కోసం కలలు కనడం మొదలు పెట్టేశా అంటూ ఒక క్యాప్షన్ కూడా ఇచ్చాడు. దీనిపై శిఖర్ ధావన్, విరాట్ కోహ్లిలు ట్రోల్ చేస్తూ రహానేను ఆట పట్టించారు. ‘ చాలా మంచి పోజ్.. బాగుంది జింక్సీ’(రహానేను ముద్దుగా పిలిచే పేరు) అని కోహ్లి బదులిచ్చాడు. ఇక ధావన్ అయితే కాస్త చమత్కారం జోడించి మరీ రిప్లై ఇచ్చాడు. ‘ ఈ పిక్చర్ నా కలలో కూడా వచ్చిందే’ అనే అర్థం వచ్చేలా హిందీలో సెటైర్ వేశాడు. అంటే తనకు పింక్ బాల్ టెస్టు ఆడాలని ఉందని చెప్పకనే చెప్పేశాడు ధావన్.
కాగా, మయాంక్ అగర్వాల్-రోహిత్ శర్మల జోడి టెస్టు ఫార్మాట్లో ఓపెనర్లగా సక్సెస్ కావడంతో కేఎల్ రాహుల్-ధావన్లు టెస్టులు ఆడే అవకాశం రావడం లేదు. గతేడాది ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్లో భారత్ తరఫున చివరిసారి టెస్టుల్లో కనిపించాడు ధావన్. అప్పుట్నుంచీ ఇప్పటివరకూ కేవలం పరిమిత ఓవర్ల క్రికెట్కు మాత్రమే పరిమితమయ్యాడు ధావన్.