న్యూఢిల్లీ: ఇంగ్లండ్తో త్వరలో ఆరంభంకానున్న టెస్టు సిరీస్లో కేఎల్ రాహుల్కి ఓపెనర్గా అవకాశమివ్వాలని భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ సూచించాడు. ప్రస్తుతం ఈ సిరీస్ కోసం ప్రకటించిన జట్టులో శిఖర్ ధావన్, మురళీ విజయ్, కేఎల్ రాహుల్ రూపంలో ముగ్గురు ఓపెనర్లు ఉన్నారు. దీంతో తుది జట్టులో ఓపెనర్లుగా ఎవరు బరిలోకి దిగుతారు అనే విషయంలో సందిగ్థత నెలకొంది. ‘మీరైతే ఎవర్ని ఓపెనర్లుగా పంపిస్తారు’ ? అని గంగూలీని ప్రశ్నించగా.. మురళీ విజయ్, కేఎల్ రాహుల్ జోడికే ఓటేశారు గంగూలీ. ఆగస్టు 1 నుంచి భారత్, ఇంగ్లండ్ మధ్య ఐదు టెస్టుల సిరీస్ ప్రారంభంకానుంది.
‘టెస్టు సిరీస్లో నేనైతే మురళీ విజయ్, కేఎల్ రాహుల్ని ఎంచుకుంటాను. శిఖర్ ధావన్ కూడా వన్డేల్లో మెరుగ్గా రాణిస్తున్నాడు. ఇంగ్లాండ్ గడ్డపై ఇటీవల ముగిసిన వన్డే సిరీస్లోనూ మంచి టచ్లో కనిపించాడు. కానీ.. టెస్టుల్లో విదేశీ గడ్డపై అతనికి మంచి రికార్డు లేదు. దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా పిచ్లపై టెస్టుల్లో అతను తడబడుతున్నాడు. బెంగళూరు వేదికగా అఫ్గానిస్తాన్తో జరిగిన ఏకైక టెస్టులో లంచ్లోపే అతను శతకాన్ని నమోదు చేయగలిగాడు. ఏదిఏమైనా తుది జట్టు నిర్ణయం పూర్తిగా టీమిండియా మేనేజ్మెంట్దే. చూడాలి ఎవరిని ఓపెనర్లుగా పంపిస్తారో..?’ అని గంగూలీ తెలిపారు.
చదవండి: లక్ష్మణ్ వద్దన్నా చేసా: గంగూలీ