ప్రపంచకప్‌: ధావన్‌ ఔట్‌.. పంత్‌కు పిలుపు

19 Jun, 2019 16:57 IST|Sakshi

లండన్‌: టీమిండియా డాషింగ్‌ ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ ప్రపంచకప్‌ టోర్నీ నుంచి నిష్క్రమించాడు. తొలుత గాయం కారణంగా ధావన్‌కు మూడు నుంచి నాలుగు వారాల విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. అయితే తాజాగా స్కానింగ్‌ చేయగా గాయం ఏ మాత్రం తగ్గకపోవడంతో అతడు కోలుకునేందుకు మరింత సమయం పడుతుందని వైద్యులు తెలిపారు. దీంతో ప్రపంచకప్ నుంచి ధావన్‌ను తప్పిస్తున్నట్లు బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. ఈ విషయాన్ని టీమ్‌ మేనేజర్‌ సునీల్‌ సుబ్రహ్మణ్యం మీడియా సమావేశంలో వెల్లడించారు.. ‘గాయం కారణంగా ప్రపంచకప్‌ నుంచి ధావన్‌ నిష్క్రమించాడు. అతడు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాము’ అంటూ పేర్కొన్నాడు. 
ప్రపంచకప్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో బ్యాటింగ్ సంద‌ర్భంగా శిఖ‌ర్ ధావ‌న్ వేలికి గాయ‌మైన విష‌యం తెలిసిందే. ప్యాట్‌ క‌మిన్స్‌ విసిరిన బౌన్స‌ర్‌ను ఆడే క్ర‌మంలో బంతి నేరుగా అత‌ని వేళ్ల‌ను తాకింది. దీనితో వేలు చిట్లింది. ఫ‌లితంగా నాలుగు వారాల పాటు విశ్రాంతి అవ‌స‌రమని డాక్ట‌ర్లు తెలిపారు. అయిన‌ప్ప‌టికీ శిఖ‌ర్ ధావ‌న్ నెట్స్‌లో ప్రాక్టీస్ చేశాడు. దీంతో సెమీస్‌ వరకు అందుబాటులో ఉంటాడని అందరూ భావించారు. అంతేకాకుండా బీసీసీఐకి ధావన్‌ను తప్పించడం మొదట్నుంచి ఇష్టం లేదు. దీంతో ధావన్‌ను తప్పించకుండా పంత్‌ను బ్యాకప్‌గా ఇంగ్లండ్‌కు పంపించింది. అయితే గాయం నుంచి కోలుకోవడానికి ఇంకా సమయం పడుతుందని వైద్యులు సూచించడంతో బీసీసీఐ డైలమాలో పడింది. 

ధావన్ స్థానంలో రిషబ్ పంత్‌ భారత జట్టులో చోటు దక్కించుకునే అవకాశం ఉంది. గబ్బర్‌కు గాయమైన విషయం తెలిసిన వెంటనే పంత్‌ ఇంగ్లాండ్ బయల్దేరి వెళ్లాడు. కానీ పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో అతడికి తుది జట్టులో చోటు దక్కలేదు. ఆ మ్యాచ్‌లో విజయ్ శంకర్‌కు అవకాశం దక్కింది. ఇక టీమిండియా శనివారం తదుపరి మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్‌తో తలపడనుంది

మరిన్ని వార్తలు