కెప్టెన్సీ అందుకే వదులుకున్నా: ధోని

14 Sep, 2018 08:23 IST|Sakshi

సాక్షి, స్పోర్ట్స్‌: క్రికెట్‌ చరిత్రలో టీమిండియా మాజీ సారథి ఎంఎస్‌ ధోనికి సముచిత స్థానం ఉంటుంది. సారథిగా, ఆటగాడిగా ఎన్నొ రికార్డులు తన పేరిట లిఖించుకున్నాడు. కూల్‌ కెప్టెన్సీతో, బెస్ట్‌ ఫినిషింగ్‌తో జట్టుకు ఎన్ని చిరస్మరణీయ విజయాలు అంధించాడు. 2014 మెల్‌బోర్న్‌ టెస్టు అనంతరం లాంగ్‌ ఫార్మట్‌ క్రికెట్‌ నుంచి తప్పుకున్న ఈ రాంచీ డైనమెట్‌.. హఠాత్తుగా 2017లో వన్డే, టీ20 క్రికెట్‌ ఫార్మట్‌ల సారథ్య బాధ్యతల నుంచి కూడా తప్పుకున్నాడు. అయితే అప్పట్లో తీసుకున్న సంచలన నిర్ణయంపై ధోని తాజాగా స్పందించాడు.

ప్రస్తుత టీమిండియా సారథి విరాట్‌ కోహ్లికి బాధ్యతలు ఆగమేఘాల మీద అప్పజెప్పింది కాదని మిస్టర్‌ కూల్‌ వివరించాడు. ‘2019 ప్రపంచ కప్‌కు బలమైన జట్టును తయారు చేసుకోవడానికి కొత్త కెప్టెన్‌కు సమయం కావాలి. ముందు సారథిగా అతను కుదురుకోవాలి. ఆ తర్వాత తన వ్యూహాలకనుగుణంగా ఆటగాళ్లను ఎంపిక చేసుకుంటాడు. నేను ఇప్పటికీ నమ్ముతున్నాను సరైన సమయంలోనే కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాను’ అంటూ ధోని పేర్కొన్నాడు. గతంలో కూడా ధోని ముందు చూపు నిర్ణయాలు భారత క్రికెట్‌కు ఎంతో మేలు చేసాయని, నిజమైన నాయకుడి లక్షణాలు ధోనిలో ఉన్నాయని నెటిజన్లు మాజీ సారథిని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.  

మరిన్ని వార్తలు