ధోనీ ఖాతాలో అరుదైన రికార్డ్

17 May, 2017 07:58 IST|Sakshi
ధోనీ ఖాతాలో అరుదైన రికార్డ్

ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) లో టీమిండియా క్రికెటర్, రైజింగ్ పుణే సూపర్ జెయింట్ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోనీ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్ -10లో ధోనీ ప్రాతినిధ్యం వహిస్తున్న పుణే జట్టు ఫైనల్లోకి ప్రవేశించిన విషయం తెలిసిందే. దీంతో పుణే ఆటగాడు ధోనీ రికార్డు స్థాయిలో ఏడోసారి ఐపీఎల్ ఫైనల్ ఆడబోతున్నాడు. తద్వారా ఐపీఎల్‌లో ఈ ఘనత వహించిన ఏకైక క్రికెటర్‌గా ధోనీ నిలిచాడు.

ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచీ చెన్నై సూపర్ కింగ్స్ కు ప్రాతినిధ్యం వహించిన ధోనీ ఆ జట్టు తరఫున ఏకంగా ఆరుసార్లు ఫైనల్ మ్యాచ్ లో భాగస్వామి అయ్యాడు. కెప్టెన్‌గా రెండుసార్లు చెన్నైకి ఐపీఎల్ కప్‌ అందించాడు. గత రెండు సీజన్ల నుంచి పుణే జట్టకు ఆడుతున్న ధోనీ ఐపీఎల్-10లో ఫైనల్ ఆడబోతున్న ఆ జట్టులో కీలక ఆటగాడు. నిన్న (మంగళవారం) ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చివరి రెండు ఓవర్లలో ధోనీ వీర విహారం చేయడంతో ఆ జట్టు పోరాడే స్కోరు చేయగలిగింది. ప్రతి మ్యాచ్‌లోనూ కెప్టెన్ స్టీవ్ స్మిత్‌కు విలువైన సలహాలిస్తూ, అవసరమైనప్పుడు ఫీల్డింగ్ సెట్ చేస్తూ జట్టు విజయంలో ధోనీ కీలకపాత్ర పోషిస్తున్నాడు.

టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన పుణే 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. మనోజ్‌ తివారి (48 బంతుల్లో 58; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), అజింక్య రహానే (43 బంతుల్లో 56; 5 ఫోర్లు, 1 సిక్స్‌), ఎంఎస్‌ ధోనీ (26 బంతుల్లో 40 నాటౌట్‌; 5 సిక్సర్లు) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. 163 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన ముంబై నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లకు 142 పరుగులు చేసి ఓటమిపాలైంది. మూడు వికెట్లు తీసి పుణే విజయంలో కీలకపాత్ర పోషించిన వాషింగ్టన్‌ సుందర్‌ (3/16)కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది.

>
మరిన్ని వార్తలు