'అప్పుడే పదేళ్లయిందా.. నమ్మలేకపోతున్నా'

5 Jul, 2020 14:15 IST|Sakshi

రాంచీ : ఎంఎస్‌ ధోని.. టీమిండియా జట్టుకు ఒక కెప్టెన్‌గా, ఆటగాడిగా ఎంత సక్సెస్‌ అయ్యాడో.. వైవాహిక జీవితంలోనూ అంతే విజయం సాధించాడు. తన చిన్ననాటి స్నేహితురాలైన సాక్షి సింగ్‌ను ప్రేమించిన ధోని 2010 జూలై 4న పెళ్లి చేసుకున్నాడు. వీరి వివాహం జరిగి సరిగ్గా పదేళ్లు. ఈ పదేళ్లలో వారి జీవితంలో ఆనంద క్షణాలే తప్ప ఎటువంటి గొడవలు లేవు. ఆనందంగా గడుపుతున్న వీరి జీవితంలోకి జీవా వచ్చి ఆ సంతోషాన్ని మరింత రెట్టింపు చేసింది. తాజాగా పెళ్లి రోజును పురస్కరించుకొని ధోని భార్య సాక్షి ధోని గత పదేళ్లలో వారి మధ్య చోటుచేసుకున్న మధుర క్షణాలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసుకున్నారు. ఇందులో భాగంగా సాక్షి తన భర్త ధోనితో పాటు తమ గారాల పట్టి జీవాకు సంబంధించిన ఫోటోలను షేర్‌ చేసుకుంది. (క్రికెటర్ కుశాల్‌ మెండిస్‌‌‌ అరెస్ట్‌)


'మా వైవాహిక జీవితానికి అప్పుడే పదేళ్లు పూర్తయ్యాయంటే నమ్మలేకపోతున్నా. పదేళ్లుగా ఇద్దరం కలిసి ఒక ఆనంద జీవితం గడిపాం. ఎన్నోసార్లు మా మధ్య చిన్న చిన్న గొడవలు జరిగినా ఎప్పటికప్పుడు సరిదిద్దుకునేవాళ్లం. మా ఇద్దరి జీవితాల్లోకి జీవా రావడం ఒక మధురమైన క్షణం. జీవితంలో నిజాయితీగా ఉన్నాం కాబట్టే మా బంధం మరింత బలపడింది. జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎదురైనా ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ముందుకు సాగిపోతున్నామంటే ప్రేమలో ఉన్న గొప్పతనం ఏంటనేది మీకు అర్థమయ్యే ఉంటుంది. ' అంటూ రాసుకొచ్చారు. అంతకముందు ధోని, సాక్షిల పెళ్లి రోజు పురస్కరించుకొని బంధువులు, స్నేహితులు, అభిమానులు విషెస్‌ చెప్పారు. దానికి బదులుగా.. 'మాకు శుభాకాంక్షలు తెలిపిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు.. కష్టకాలంలో మాకు అండగా నిలిచిన బంధువులు, స్నేహితులు, అభిమానులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నా.' అంటూ సాక్షి స్పందించారు.

మరిన్ని వార్తలు