భారత్‌కు కష్టాలే: స్మిత్‌ 

22 Dec, 2017 00:20 IST|Sakshi

న్యూఢిల్లీ: దక్షిణాఫ్రికా పేస్‌ బౌలింగ్‌తో భారత్‌కు కష్టాలు తప్పవని ఆ జట్టు మాజీ కెప్టెన్‌ గ్రేమ్‌ స్మిత్‌ అన్నారు.  ఈ పర్యటనలో టీమిండియాపైనే ఒత్తిడి ఉంటుందని చెప్పారు. జనవరి 5 నుంచి ఇరు జట్ల మధ్య తొలి టెస్టు ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో స్మిత్‌ మాట్లాడుతూ ‘మా జట్టు పటిష్టంగా ఉంది. డివిలియర్స్‌ రాకతో బ్యాటింగ్‌ బలం పెరిగింది. బౌలింగ్‌ కూడా అత్యంత శక్తిమంతంగా ఉంది. నలుగురు అనుభవజ్ఞులైన పేసర్లతో అన్ని విభాగాల్లో సమతూకంగా ఉంది’ అని అన్నారు. స్పిన్‌కు సహకరించే కేప్‌టౌన్‌ వేదిక భారత్‌కు అనుకూలించే అవకాశమున్నా... తదుపరి ప్రిటోరియా (రెండో టెస్టు), జొహన్నెస్‌బర్గ్‌ (మూడో టెస్టు)లు పూర్తిగా పేస్‌  పిచ్‌లని... అక్కడ కోహ్లి సేనకు పెను సవాళ్లు ఎదురవుతాయని చెప్పారు.

అయితే పటిష్టమైన బ్యాటింగ్‌ లైనప్‌ ఉన్న భారత్‌ భారీ స్కోర్లు చేస్తే గట్టెక్కే అవకాశముందని స్మిత్‌ వివరించారు. ‘భారత ఇన్నింగ్స్‌లో పుజారా, కోహ్లిలే కీలకం. వీళ్లిద్దరు గత టూర్‌లో అద్భుతంగా ఆడారు’ అని కితాబిచ్చారు. ఉమేశ్, షమీ, భువీ, ఇషాంత్, బుమ్రాలలో ముగ్గురు రాణిస్తే భారత్‌ సిరీస్‌లో విజయవంతం అయ్యే అవకాశాలున్నాయని స్మిత్‌ విశ్లేషించారు. భారత ఉపఖండంలో బౌలర్లు చిన్న చిన్న స్పెల్స్‌తో సరిపెట్టేయవచ్చని... కానీ సఫారీలో బౌలర్లు సుదీర్ఘ స్పెల్స్‌ వేసేందుకు సిద్ధమవ్వాలని సూచించారు.    

మరిన్ని వార్తలు