సుశాంత్‌ను కలుస్తానని మాటిచ్చా..

19 Jun, 2020 14:37 IST|Sakshi

హైదరాబాద్‌: బాలీవుడ్‌ యువ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ నటించిన తొలి చిత్రం ‘కైపోచే’ అందరికీ గుర్తుండే ఉంటుంది. నటుడిగా ఫిల్మ్‌ఫేర్‌ అవార్డు అందుకున్న ఈ చిత్రంలో ఇషాన్‌ పాత్రలో సుశాంత్‌ కనిపించగా.. అలీ అనే ప్రొఫెషనల్‌ క్రికెటర్‌ పాత్రలో మహారాష్ట్రకు చెందిన  దిగ్విజయ్‌ దేశ్‌ముఖ్‌ నటించాడు. అయితే ఈ సినిమా షూటింగ్‌ సమయంలో దిగ్విజయ్‌ సుశాంత్‌కు ఓ మాటిచ్చాడంట. ఓ స్థాయి క్రికెటర్‌గా ఎదిగేవరకు మళ్లీ కలవనని శపథం చేశాడంట. ఈ విషయాన్ని దిగ్విజయ్‌ స్వయంగా వెల్లడించాడు. అయితే ఇప్పుడు ఓ స్థాయి క్రికెటర్‌గా ఎదిగినప్పటికీ అతడిని కలిసే అవకాశం లేకపోవడం చాలా బాధాగా ఉందన్నాడు. (సుశాంత్‌ సోదరి భావోద్వేగ లేఖ)

‘సుశాంత్‌ క్రికెట్‌పై ఎంతో ఆసక్తి కనబర్చేవాడు. షూటింగ్‌ సమయంలో నా వయసు 15 ఏళ్లు. అయినా నాతో చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు. షూటింగ్‌ తర్వాత అనేక విషయాల గురించి చర్చించేవాళ్లం. ఇక ఆరు నెలల పాటు మా సినిమా ప్రయాణం సాగింది.  కైపోచే సినిమా షూటింగ్‌ చివరి రోజు అతడికి ఓ మాటిచ్చాను. నేను మళ్లీ నిన్ను కలిసేది ఓ స్థాయి అటగాడిగా ఎదిగాకనే అని శపథం చేసి చెప్పాను. అయితే గత డిసెంబర్‌లో నిర్వహించిన ఐపీఎల్‌ వేలంలో ముంబై ఇండియన్స్‌ నన్ను తీసుకుంది. అప్పుడే అతడిని కలవాలనుకున్నా కుదరలేదు. తర్వాత కరోనా లాక్‌డౌన్‌ కారణంగా అతడికి కలిసేందుకు అస్సలు వీలుపడలేదు. ఇప్పడు కలుద్దామనుకున్నా ఆయన లేరు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ఉంది. మాట నిలబెట్టుకోలేదు, కలవలేకపోయాననే బాధ నన్ను తీవ్రంగా వేధిస్తోంది’ అని దిగ్విజయ్‌ బాధపడ్డాడు. (సుశాంత్‌కి తొలి అవ‌కాశం ఇచ్చింది నేనే)

ఇక ఇదే విషయాన్ని ముంబై ఇండియన్స్‌ తమ అధికారిక ట్విటర్‌లో పేర్కొంటూ.. త్వరలో అలీ(దిగ్విజయ్‌) మైదానంలో ఆడుతుంటే అతడి గురువు ఇషాన్‌ (సుశాంత్‌) పై నుంచి చూసి అనందిస్తాడాని హార్ట్‌ టచింగ్‌ పోస్ట్‌ చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్‌ నెటిజన్లను, సుశాంత్‌ ఫ్యాన్స్‌ను తెగ ఆకట్టుకుంది. దీంతో ముంబై ఇండియన్స్‌ చేసిన ట్వీట్‌ తెగ వైరల్‌ అవుతోంది. సుశాంత్‌ ఆదివారం ముంబై నగరం బాంద్రాలోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.   

మరిన్ని వార్తలు