మా మధ్య అభిప్రాయ బేధాల్లేవ్‌: దీపికా పల్లికల్‌

29 May, 2020 15:41 IST|Sakshi

ప్రొఫెషనల్‌ కెరీర్‌ ఊసే ఉండదు

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ కారణంగా వచ్చిన లాక్‌డౌన్‌ సమయాన్ని తాము ఎంతగానో ఆస్వాదిస్తున్నామని స్వ్కాష్‌ క్రీడాకారిణి, దినేశ్‌ కార్తీక్‌ భార్య దీపికా పల్లికల్‌ తెలిపారు. ఎక్కువగా క్రీడలు చుట్టూ తిరుగుతూ వైవాహిక జీవితాన్ని పరిమితంగా గడపాల్సి వస్తూ ఉంటుందని, కానీ లాక్‌డౌన్‌తో తాము మరింత దగ్గరై ఒకరి అవసరాల గురించి మరొకరం మాట్లాడుకునే వీలుదొరికిందన్నారు. ఈ లాక్‌డౌన్‌ సమయంలో ఫిట్‌నెస్‌ ఫోకస్‌ చేసినట్లు పేర్కొన్న దీపికా.. ప్రొఫెషనల్‌ అథ్లెట్లుగా తమకు ఇది  పెద్ద బ్రేక్‌గా అని అన్నారు. తాము ఎప్పుడూ తమ ఆటల గురించి ఎక్కువగా చర్చించుకోమని, కేవలం స్పోర్ట్స్‌ పర్సన్స్‌గా ఏమి కావాలో వాటి గురించి మాత్రమే ఆలోచిస్తామన్నారు. (‘నన్ను 15 పరుగుల బ్యాట్స్‌మన్‌ అన్నారు’)

‘ఈ లాక్‌డౌన్‌ సమయంలో ఇద్దరం కలిసి ఇంటి పనులను పంచుకుంటున్నాం. అథ్లెట్లకు ఎప్పుడైనా కుటుంబంతో కలిసి గడిపే సమయం చాలా తక్కువగా ఉంటుంది. లాక్‌డౌన్‌ మమ్మల్ని మేము మరింత తెలుసుకోవడానికి మంచి అవకాశం. ఇప్పటివరకూ మేము బిజీ బిజీ షెడ్యూల్‌తోనే గడుపుతూ వచ్చాం. ఇప్పుడు ఎటువంటి స్పోర్ట్స్‌ ఈవెంట్స్‌ లేకపోవడంతో ఇంటికే పరిమితమయ్యాం. మా మధ్య ఎప్పుడూ అభిప్రాయ బేధాలు రాలేదు. మేమిద్దరం ఒకరిని ఒకరు అర్ధం చేసుకోవడంతో మా గేమ్స్‌ల్లో మరింత రాటుదేలే అవకాశం ఏర్పడింది. మా మధ్య ఫిర్యాదులు అనేవి ఉండవు. మేము ఇంటి దగ్గర ఉన్నామంటే మా మధ్య  క్రీడల చర్చే రాదు. జీవితంలోని మిగతా విషయాల గురించే ఎక్కువగా మాట్లాడుకుంటాం. ప్రొఫెషనల్‌ లైఫ్‌ను గౌరవించుకుంటాం తప్పితే వాటి గురించి చర్చలు పెట్టం’ అని దీపికా పల్లికల్‌ అన్నారు. 2015లో వీరిద్దరూ వివాహ బంధంతోo ఒక్కటైన సంగతి తెలిసిందే. (‘అదే రోహిత్‌ను సక్సెస్‌ఫుల్‌ కెప్టెన్‌ చేసింది’)

మరిన్ని వార్తలు