కేకేఆర్‌ హీరో.. దినేశ్‌ కార్తీక్‌

24 May, 2018 12:56 IST|Sakshi

కోల్‌కతా: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)-11 సీజన్‌ ఆరంభానికి ముందు కోల్‌కతా నైట్‌రైడర్స్‌ గౌతం గంభీర్‌ను వదులుకున్న తర్వాత  కెప్టెన్‌గా ఎవరును నియమించాలనే దానిపై ఆ జట్టు యాజమాన్యం తీవ్ర తర్జన భర్జనలు పడింది. కోల్‌కతా కెప్టెన్‌గా దినేశ్‌ కార్తీక్‌ను ఎంపిక​ చేయాలా?లేక రాబిన్‌ ఉతప్పకు పగ్గాలు అప‍్పచెప్పాలా? అనే అంశంపై లోతుగా విశ్లేషించింది. అయితే చివరకు దినేశ్‌ కార్తీక్‌ను కెప్టెన్‌గా నియమిస్తూ కేకేఆర్‌ నిర్ణయం తీసుకుంది. తనపై పెట్టుకున్న నమ్మకాన్ని దినేశ్‌ కార్తీక్‌ నిలబెట్టాడనే చెప్పాలి. బుధవారం రాజస్తాన్‌ రాయల్స్‌తో జరిగిన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో కేకేఆర్‌ 25 పరుగుల తేడాతో విజయం సాధించి క్వాలిఫయర్‌-2కు అర్హత సాధించింది. ఈ విజయంలో దినేశ్‌ కార్తీక్‌(52;38 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు) కీలక పాత్ర పోషించాడు.

మరొకవైపు ప్రస్తుత సీజన్‌లో ఆ జట్టు తరపున అత్యధిక పరుగులు చేసి కార్తీక్‌ హీరోగా నిలిచాడు. ప్రస్తుత సీజన్‌లో దినేశ్‌ కార్తీక్‌ చేసిన పరుగులు ఇప్పటివరకూ 490. ఐపీఎల్‌-11లో కేకేఆర్‌ తరపున ఇదే అత్యధికం. అంతకుముందు సీజన్‌లలో కేకేఆర్‌ తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రాబిన్‌ ఉతప్ప(660-2014) ముందు వరుసలో ఉన్నాడు. ఇక మూడు సీజన్‌లలో కేకేఆర్‌ తరపున గౌతం గంభీర్‌(590-2012, 501-2016, 498-2017) అత్యధక పరుగుల్ని నమోదు చేశాడు. ఆ తర్వాత స్థానంలో సౌరవ్‌ గంగూలీ(493-2008), ఉండగా తాజాగా వారి సరసన దినేశ్‌ కార్తీక్‌ చేరాడు.

మరిన్ని వార్తలు