నువ్వు ఎవరని దాదా ప్రశ్నించాడు: కార్తీక్‌

8 Jul, 2018 13:40 IST|Sakshi

న్యూఢిల్లీ: దాదాపు 14 ఏళ్ల క్రితం జరిగిన చాంపియన్స్‌ ట్రోఫీలో భాగంగా అప్పటి భారత క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీతో ఎదురైన వింత అనుభవాన్ని సీనియర్‌ వికెట్‌ కీపర్‌ దినేశ్‌ కార్తీక్‌ తాజాగా గుర్తు చేసుకున్నాడు. గౌరవ్‌ కపూర్‌ వ్యాఖ్యాతగా వ్యవహరించే ‘బ్రేక్‌ఫాస్ట్‌ విత్‌ చాంపియన్స్‌’ షోకు ఇటీవల  హాజరైన దినేశ్‌ కార్తీక్‌ ఆనాటి జ్ఞాపకాల్ని నెమరవేసుకున్నాడు.

‘అది 2004 చాంపియన్స్‌ ట్రోఫీ. అప్పుడు భారత  జట్టుకు  గంగూలీ కెప్టెన్‌గా ఉన్నాడు. అప్పటికి నేను అంతర్జాతీయ  క్రికెట్‌లోకి అడుగుపెట్టి కొంత సమయే అయ్యింది. ఆ సమయానికి నా వయసు 19 ఏళ్లు. చాంపియన్స్‌ ట్రోఫీలో పాకిస్తాన్‌తో భారత జట్టు మ్యాచ్‌ ఆడుతుంది. అది చావో-రేవో మ్యాచ్‌. ఆ మ్యాచ్‌లో నేను తుది జట్టులో లేను.. సబ్‌స్టిట్యూట్‌గా మాత్రమే ఉన్నా. పాకిస్తాన్‌ వికెట్‌ పడిన తర్వాత నేను వాటర్‌ బాటిల్స్‌ తీసుకుని గ్రౌండ్‌లోకి పరుగెత్తా. అప్పుడు జట్టు సభ్యులతో గంగూలీ(దాదా) గేమ్‌ ప్లాన్‌లో నిమగ్నమయ్యాడు. నేను జట్టు సభ్యులకు సర్వ్‌ చేసే క్రమంలో వారి ముందుకు వెళ్లి ఆగాలి. కానీ ఆ సందర్భంలో నా కాలికి గడ్డి అడ్డుపడటంతో గంగూలీని తాకా. దాంతో నా వైపు తిరిగిన గంగూలీ.. ఇటువంటి వాళ్లని ఎక్కడ నుంచి తీసుకొస్తారు అని అడిగాడు. అదే సమయంలో ఇంతకీ నువ్వు ఎవరు అని ప్రశ్నించాడు’ అని  ఆనాటి ఇబ్బందికర పరిస్థితిని దినేశ్‌ కార్తీక్‌ వివరించాడు.
 

మరిన్ని వార్తలు