టీమిండియాలో ఛేంజ్‌.. దినేశ్‌ కార్తీక్‌కు పిలుపు!

16 Jan, 2018 12:33 IST|Sakshi

జోహాన్నెస్‌బర్గ్‌: వికెట్ కీపర్ దినేష్ కార్తీక్‌కు పిలుపు అందింది. దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న వృద్ధిమాన్ సాహా ట్రైనింగ్‌ సెషన్‌లో గాయపడటంతో అతని స్థానంలో కార్తీక్‌ను పంపాలని నిర్ణయించినట్లు బీసీసీఐ వెల్లడించింది. దీంతో దినేశ్‌ కార్తీక్‌ ఫ్లయిట్‌ ఎక్కి.. మూడో టెస్టులోపు జట్టులో చేరబోతున్నాడు.

తొలి టెస్ట్ తర్వాత ప్రాక్టీస్‌ చేస్తుండగా సాహా మోకాలికి గాయమైంది. దీంతో అతన్ని రెండో టెస్ట్‌కు పక్కనపెట్టి పార్థివ్ పటేల్‌ను తుది జట్టులోకి తీసుకున్నారు. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో మూడో టెస్ట్‌కు కూడా సాహా దూరం కానున్నాడు. ఈలోగా బీసీసీఐ మెడికల్ టీమ్ సాహా పరిస్థితిని సమీక్షించి.. అతన్ని దక్షిణాఫ్రికా టూర్‌లో కొనసాగించాలా? వద్ద అన్నది నిర్ణయం తీసుకోనుంది. తొలి టెస్ట్‌లో బ్యాటింగ్‌లో విఫలమైనా.. వికెట్‌ కీపర్‌గా సాహా రాణించాడు. మూడు టెస్టుల సిరీస్‌లో భారత్‌ 0-1 తేడాతో వెనుకబడి ఉంది. ప్రస్తుతం కొనసాగుతున్న రెండోటెస్టు రసకందాయంలో పడింది. సఫారీలు మొదటి ఇన్నింగ్స్‌లో 335పరుగులు చేయగా, భారత్‌ 307 పరుగులకు ఆలౌట్‌ అయింది. రెండో ఇన్నింగ్స్‌లో సఫారీలు రెండు వికెట్లకు 90పరుగులు చేసి.. పట్టుబిగించే దిశగాసాగుతున్నారు.

మరిన్ని వార్తలు