కార్తీక్‌.. నువ్వు ధోని అనుకుంటున్నావా?

11 Feb, 2019 10:52 IST|Sakshi
దినేశ్‌ కార్తీక్‌

సోషల్‌ మీడియాలో అభిమానుల ఫైర్‌

హామిల్టన్‌ : గతేడాది బంగ్లేదేశ్‌తో జరిగిన నిదహాస్‌ ట్రోఫీ ఫైనల్లో ఆఖరి బంతికి సిక్స్‌ కొట్టి గెలిపించిన టీమిండియా క్రికెటర్‌ దినేశ్‌ కార్తీక్‌.. ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో మాత్రం హిట్టర్‌గా విఫలమయ్యాడు. నిదహాస్‌ విక్టరీతో కార్తీక్‌కు ఎన్నడూ లేని విధంగా గుర్తింపు, ప్రశంసలు లభించాయి. అయితే తాజాగా జరిగిన మ్యాచ్‌లో మాత్రం కార్తీక్‌ విజయానికి కావాల్సిన పరుగులు చేయలేక తడబడ్డాడు. భారత విజయానికి చివరి ఓవర్లో 16 పరుగులు అవసరం కాగా.. క్రీజులో దినేశ్‌ కార్తీక్‌, కృనాల్‌ పాండ్యాలున్నారు. అప్పటికే దాటిగా ఆడుతూ ఈ ఇద్దరు క్రీజులో కుదుర్కోవడంతో భారత్‌ విజయం కాయమని అందరూ భావించారు. కానీ సౌతీ అద్భుతంగా బౌలింగ్‌ చేసి భారత గెలుపును అడ్డుకున్నాడు. (చదవండి: రోహిత్‌ నిర్ణయమే కొంప ముంచిందా?)

ఈ ఓవర్లో తొలి బంతిని ఎదుర్కొన్న కార్తీక్‌ రెండు పరుగులే చేశాడు. మరుసటి బంతిని వైడ్‌ అనుకొని వదిలేశాడు. కానీ అంపైర్‌ దాన్ని వైడ్‌గా ప్రకటించలేదు. మూడో బంతి సింగిల్‌ వచ్చే అవకాశం ఉన్నా.. ఆఫ్‌ పిచ్‌ దాటిన కృనాల్‌ను వారించి మరి వెనక్కు పంపాడు. నాలుగో బంతి సింగిల్‌ తీసివ్వగా.. కృనాల్‌ కూడా మరో సింగిల్‌ తీసి కార్తీక్‌కు స్ట్రైకింగ్‌ ఇచ్చాడు. చివరి బంతి వైడ్‌కావడంతో భారత్‌కు మరో పరుగుతో పాటు బంతి ఆడే ఆవకాశం వచ్చింది. ఇక ఆఖరి బంతిని కార్తీక్‌ సిక్స్‌ కొట్టినప్పటికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ ఓవర్లో కేవలం 11 పరుగులే రావడంతో భారత్‌ 4 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. (చదవండి: ఆ బాల్‌ వైడ్‌గా ఇచ్చుంటే..)

అయితే కృనాల్‌ సింగిల్‌కు ప్రయత్నించినప్పుడు కార్తీక్‌ తిరస్కరించడాన్ని భారత అభిమానులు తప్పుబడుతున్నారు. ఆ సింగిల్‌ తీసుంటే పరిస్థితి మరోలా ఉండేదని, అది భారత గెలుపుకు దారితీసేదని అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే సోషల్‌ మీడియా వేదికగా కార్తీక్‌పై మండిపడుతున్నారు. ‘కార్తీక్‌.. నువ్వు ధోని అనుకుంటున్నావా?’ అని ఒకరు.. ‘ఎప్పుడూ స్వప్రయోజనం కోసమే కార్తీక్‌ ఆడుతాడు.. ఇదే ధోనికి కార్తీక్‌ ఉన్న తేడా’ అని మరొకరు ఘాటుగా కామెంట్‌ చేస్తున్నారు. అయితే ఈ వ్యవహారంలో కార్తీక్‌ది ఏమాత్రం తప్పులేదని.. ఓ సీనియర్‌ బ్యాట్స్‌మన్‌గా జట్టును గెలిపించాలనే ఉద్దేశంతోనే అతను సింగిల్‌ తీయలేదని, కానీ సౌతి బౌలింగ్‌ అద్భుతంగా చేయడంతో అది కుదరలేదని మరికొందరు సమర్ధిస్తున్నారు. ఏది ఏమైనప్పటికి గెలిస్తే పొగడటం..ఓడితే తిట్టడం సోషల్‌ మీడియాలో సర్వసాధారణమైపోయింది. (చదవండి: ఆఖరి ఆట అపజయంతో...)

>
మరిన్ని వార్తలు