దినేశ్‌ కార్తీక్‌ ఆగ్రహం.. జట్టు సభ్యులకు వార్నింగ్‌!

4 May, 2019 10:14 IST|Sakshi

ఎప్పుడూ కూల్‌గా ఉండే దినేశ్‌ కార్తీక్‌.. శుక్రవారం కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌తో ఐపీఎల్‌ మ్యాచ్‌ సందర్భంగా ఒకింత యాంగ్రీగా కనిపించాడు. ప్లేఆఫ్‌ బెర్త్‌ కోసం పంజాబ్‌తో మ్యాచ్‌లో గెలుపు అత్యంత కీలకమైన నేపథ్యంలో ఈ మ్యాచ్‌లో కోల్‌కతా సారథిగా దినేశ్‌ కార్తీక్‌ కొంచెం టఫ్‌గా వ్యవహరించాడు.

టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న కోల్‌కతాకు.. ఆరంభంలోనే డెంజరస్‌ ఓపెనర్లు కేఎల్‌ రాహుల్‌, క్రిస్‌ గేల్‌ను ఔట్‌ చేయడం ద్వారా సందీప్‌ వారీయర్‌ ఆనందంలో నింపాడు. ఆ తర్వాత కోల్‌కతా  బౌలింగ్‌ స్లాపీగా మారిపోయింది. ఫీల్డింగ్‌లో సునీల్‌ నరైన్‌ ఒకింత నిరాశపరిచాడు. అంతకుముందు టీమ్‌ నిర్ణయాలను అండ్రూ రసేల్‌ బహాటంగా ప్రశ్నించిన సంగతి తెలిసిందే. మొత్తానికి కోల్‌కతా శిబిరం ఒకింత గందరగోళంలో ఉన్న నేపథ్యంలో శుక్రవారం మ్యాచ్‌లో కార్తీక్‌ భావోద్వేగాలను దాచుకోలేకపోయాడు. కోచ్‌ చూస్తుండగానే మైదానంలో తన జట్టు సభ్యులందరినీ పిలిచి.. గట్టిగా వార్నింగ్‌ ఇచ్చాడు. దినేశ్‌ కార్తీక్‌ తన టీమ్‌మేట్స్‌కు ఏం చెప్పాడన్నది వినిపించకపోయినప్పటికీ.. గట్టిగా ఆదేశాలు ఇవ్వడం.. కొంచెం టఫ్‌గా మాట్లాడటం కనిపించింది. కార్తీక్‌ ఘాటుగా మాట్లాడుతుండటం జట్టు సభ్యులు కూడా ఒకింత గంభీరంగా కనిపించారు. ఈ క్రమంలో పంజాబ్‌ నిర్దేశించిన 184 పరుగుల భారీ లక్ష్యాన్ని అలవోకగా ఛేదించిన కోల్‌కతా ప్లేఆఫ్‌ ఆశలను నిలబెట్టుకుంది. మొదటి ఐదు మ్యాచ్‌ల్లో నాలుగు మ్యాచ్‌లు గెలిచి దూకుడు మీద కనిపించిన నైట్‌రైడర్స్‌ ఆ తర్వాత వరుసగా ఆరు మ్యాచ్‌ల్లో ఓటమి పాలయ్యారు. అనంతరం ముంబై, పంజాబ్‌ల మీద వరుసగా గెలిచి.. ప్లేఆఫ్‌ రేసులో నిలిచారు.

మ్యాచ్‌ తర్వాత ఆనందంగా కనిపించిన దినేశ్‌ కార్తీక్‌.. మైదానంలో జట్టు సభ్యులకు ఘాటుగా మార్గదర్శనం ఇవ్వడంపై స్పందించాడు. ‘గతకొన్ని రోజులుగా మాకు గడ్డుకాలం నడిచింది. మ్యాచ్‌లో బౌలర్లు, ఫీల్డర్ల ప్రదర్శనతో నేను ఆనందంగా లేను. అందుకే నేను ఏమనుకుంటున్నది జట్టు సభ్యులకు చెప్పాలని అనుకున్నాను. నేను ఆగ్రహాన్ని ప్రదర్శించడం చాలా అరుదు. కానీ, నేను కోపంగా చెబితేనే.. బాయ్స్‌ ఉత్తమంగా ఆడుతారని భావించినప్పుడు. కొంచెం అలా ఉండకతప్పదు’ అని దినేశ్‌ కార్తీక్‌ చెప్పుకొచ్చాడు. కోల్‌కతా బౌలర్లు భారీగా పరుగులు ఇచ్చారని చెప్పిన కార్తీక్‌.. సామ్‌ కరన్‌ బాగా ఆడాడని ప్రశంసించాడు. కోల్‌కతా బ్యాట్‌మెన్‌ బాగా బ్యాటింగ్‌ చేశారని, భారీ లక్ష్యాన్ని ఛేదించడం తనకు ఆనందాన్ని ఇచ్చిందన్నాడు.

మరిన్ని వార్తలు