12 ఏళ్ల తర్వాత క్రికెట్‌ గుడ్‌ బై

19 Sep, 2019 12:10 IST|Sakshi

న్యూఢిల్లీ: టీమిండియా వెటరన్‌ క్రికెటర్‌ దినేశ్ మోంగియా అన్ని ఫార్మాట్ల  క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు దినేశ్ మోంగియా దూరమై సుమారు 12 ఏళ్ల అవుతోంది. ఈ నేపథ్యంలో క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు చెబుతున్నట్లు బుధవారం ప్రకటించాడు.1995లో పంజాబ్‌ తరఫున అండర్‌-19 జట్టులో అరంగ్రేటం చేసిన దినేశ్ మోంగియా చివరగా 2007లో ఇండియన్ క్రికెట్ లీగ్ టోర్నమెంట్‌లో పంజాబ్ జట్టు తరఫున తన చివరి మ్యాచ్‌ని ఆడాడు. భారత్‌ తరఫున కూడా 2007లో తన ఆఖరి వన్డే ఆడాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన ఆనాటి మ్యాచ్‌లో దినేశ్‌కు ఆఖరి వన్డే. ఇక ఏకైక అంతర్జాతీయ టీ20 మాత్రమే దినేశ్‌ ఆడాడు.  2006లో దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 మ్యాచ్‌లో టీమిండియా జట్టులో సభ్యుడిగా ఉన్నాడు.

తన అరంగేట్ర మ్యాచ్‌లోనే అందరి దృష్టిని ఆకర్షించిన దినేశ్ మోంగియా ఆరేళ్ల పాటు దేశవాళీ క్రికెట్‌లో రాణించి భారత జట్టులో చోటు దక్కించుకున్నాడు. 2003 వన్డే వరల్డ్‌కప్‌లో రన్నరప్‌గా నిలిచి భారత జట్టులో దినేశ్‌ సభ్యుడిగా ఉన్నాడు.2001లో అంతర్జాతీయ క్రికెట్‌ కెరీర్‌ను ఆరంభించాడు. 2002లో గౌహతి వేదికగా జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో 159 పరుగులతో సత్తా చాటాడు. భారత జట్టు తరఫున అతడు 57 వన్డేలు ఆడాడు. వన్డేల్లో 27.95 యావరేజితో 1,230 పరుగులు చేశాడు. 14 వికెట్లు తీశాడు. ఇక, 121 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల్లో అతను 21 సెంచరీలు చేశాడు. భారత తరఫున ఒక్క టెస్టు మ్యాచ్‌ కూడా ఆడలేదు. లాంకషైర్, లైచెస్టర్‌షైర్ తరఫున అతను కౌంటీ క్రికెట్ కూడా ఆడాడు. ఇండియన్‌ క్రికెట్‌ లీగ్‌(ఐసీఎల్‌)లో ఆడటంతో బీసీసీఐ అతడిపై చర్యలు తీసుకుంది. ఫలితంగా అతడు క్రికెట్‌కు దూరమయ్యాడు. గత సీజన్‌లో పంజాబ్ క్రికెట్ అసోసియేషన్‌లో సెలక్టర్‌గా కూడా అతను బాధ్యతలు నిర్వర్తించాడు.

మరిన్ని వార్తలు