రెజ్లింగ్‌లో నిరాశ

2 Oct, 2014 01:15 IST|Sakshi

ఇంచియాన్: ఆసియా క్రీడల్లో బుధవారం భారత క్రీడాకారులు బాక్సింగ్, అథ్లెటిక్స్, హాకీ ఈవెంట్స్‌లో పతకాలతో మెరిసినా... మిగతా క్రీడాంశాల్లో మాత్రం మనోళ్లు పూర్తిగా నిరాశపర్చారు. ఫ్రీస్టయిల్ రెజ్లింగ్‌తో పోలిస్తే గ్రీకో రోమన్ విభాగంలో ఒక్కరు కూడా కనీసం కాంస్య పతక పోరుకు కూడా అర్హత సాధించలేపోయారు.

 రెజ్లింగ్: గ్రీకో రోమన్ రెజ్లింగ్ విభాగంలో భారత రెజ్లర్లు నిరాశపర్చారు. 75 కేజీల విభాగంలో గురుప్రీత్ సింగ్ 1-3తో పయ్యమ్ పయాని (ఇరాన్) చేతిలో; 85 కేజీల ఈవెంట్‌లో మనోజ్ కుమార్ 0-3తో ఫె పెంగ్ (చైనా) చేతిలో; 130 కేజీల బౌట్‌లో ధర్మేందర్ దలాల్ 0-4తో బషీర్ డార్జి (ఇరాన్) చేతిలో;  66 కేజీల ఈవెంట్‌లో సందీప్ యాదవ్ 0-4తో కుశ్రావ్ ఓబ్లోబెర్డివ్ (తజికిస్థాన్) చేతిలో ఓటమి పాలయ్యారు.

 టేబుల్ టెన్నిస్: స్టార్ ప్లేయర్ శరత్ కమల్ నిరాశపర్చినా... సౌమ్యజిత్ ఘోష్ ప్రిక్వార్టర్స్‌లోకి ప్రవేశించాడు. పురుషుల సింగిల్స్ తొలి మ్యాచ్‌లో ఘోష్ 11-5, 11-7, 11-5, 11-4తో పతాఫోన్ తవిసాక్ (లావోస్)పై నెగ్గాడు. మరో మ్యాచ్‌లో ప్రపంచ 46వ ర్యాంకర్ శరత్ 11-6, 10-12, 11-5, 9-11, 11-6, 10-12, 9-11తో ప్రపంచ 26వ ర్యాంకర్  తన్విరివెంచకుల్ (థాయ్‌లాండ్) చేతిలో ఓడాడు.

 తైక్వాండో: 57 కేజీల విభాగంలో ఆర్తీ ఖకల్ 8-15తో గనియా అల్జాక్ (కజకిస్థాన్) చేతిలో; పురుషుల 80 కేజీల విభాగంలో రాజన్ పండియా ఆనంద్ 1-7తో యోంగ్‌యున్ పార్క్ (కొరియా) చేతిలో ఓడారు.
 బాస్కెట్‌బాల్: ఐదు, ఆరు స్థానాల కోసం జరిగిన వర్గీకరణ మ్యాచ్‌లో భారత మహిళల జట్టు నిరాశపర్చింది. 47-68తో కజకిస్థాన్ చేతిలో ఓడి ఆరో స్థానంతో సంతృప్తి చెందింది.



 

మరిన్ని వార్తలు