మియామి:ప్రపంచ నంబర్ వన్ టెన్నిస్ ఆటగాడు, సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. మియామి ఓపెన్ లో భాగంగా ఆదివారం జరిగిన ఫైనల్లో జొకోవిచ్ 6-3, 6-3 తేడాతో జపాన్ ఆటగాడు నిషీ కోరీని ఓడించి టైటిల్ చేజిక్కించుకోవడంతో అత్యధిక మాస్టర్స్ టైటిల్స్ గెలిచిన ఆటగాడిగా గుర్తింపు సాధించాడు.
మియామి ఓపెన్లో విజేతగా నిలవడంతో 28వ మాస్టర్స్ టైటిల్ను తన ఖాతాలో వేసుకుని జొకోవిచ్ ఆల్ టైమ్ రికార్డును సొంతం చేసుకున్నాడు. తద్వారా స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ పేరిట ఉన్న రికార్డు తెరమరుగైంది. ఇప్పటివరకూ 40 సార్లు మాస్టర్స్ టోర్నీల్లో ఫైనల్స్ కు చేరిన జొకోవిచ్.. అందులో సగానికి పైగా టైటిల్స్ సాధించడం విశేషం. గత మూడు సంవత్సరాల నుంచి ఇండియన్ వెల్స్, మియామి ఓపెన్ మాస్టర్స్ టోర్నీలో జొకోవిచ్ విజేతగా నిలిచి ఇంతకుముందు ఏ ఆటగాడికి సాధ్యంకాని మైలురాయిని సొంతం చేసుకోవడం మరో విశేషం.