టీమిండియా ‘అతిపెద్ద’ విజయం

6 Oct, 2018 15:08 IST|Sakshi

రాజ్‌కోట్‌: వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్‌ 272 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. శనివారం మూడో రోజు ఆటలో భాగంగా ఫాలోఆన్‌ ఆడిన వెస్టిండీస్‌ తన రెండో ఇన్నింగ్స్‌లో 50.5 ఓవర్లలో 196 పరుగులకు చాపచుట్టేసింది. దాంతో భారత్‌ తన టెస్టు క్రికెట్‌ చరిత్రలో పరుగుల పరంగా అతిపెద్ద విజయాన్ని సాధించింది. ఈ క్రమంలోనే ఇటీవల అఫ్గానిస్తాన్‌ జరిగిన టెస్టు మ్యాచ్‌లో లభించిన ఇన్నింగ్స్‌ 262 పరుగుల రికార్డును టీమిండియా సవరించింది.

తాజా టెస్టు మ్యాచ్‌లో విండీస్‌ ఆటగాళ్లలో కీరన్‌ పావెల్‌(83) మినహా ఎవరూ రాణించకపోవడంతో ఆ జట్టుకు ఘోర ఓటమి తప్పలేదు. భారత్‌ బౌలర్లలో కుల్దీప్‌ యాదవ్‌ ఐదు వికెట్లతో విండీస్‌ పతనాన్ని శాసించగా, జడేజా మూడు వికెట్లు సాధించాడు. రవిచంద్రన్‌ అశ్విన్‌కు రెండు వికెట్లు లభించాయి.  అంతకుముందు 94/6 ఓవర్‌నైట్‌ స్కోరుతో తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన విండీస్‌ 181 పరుగుల వద్ద ఆలౌటైంది. దాంతో విండీస్‌ ఫాలోఆన్‌ ఆడాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన విండీస్‌ మరోసారి తడబడింది.ఓపెనర్‌ క్రెయిగ్‌ బ్రాత్‌వైట్‌(10) తొలి వికెట్‌గా పెవిలియన్‌ చేరగా, ఆ తర్వాత స్వల్ప విరామాల్లో కీలక వికెట్లను చేజార్చుకుంది. విండీస్‌ తొలి వికెట్‌ను అశ్విన్‌ తీయగా, ఆపై ఐదు వికెట్లను కుల్దీప్‌ యాదవ్‌ సాధించాడు. విండీస్‌ చివరి నాలుగు వికెట్లలో రవీంద్ర జడేజా మూడు వికెట్లు సాధించగా, అశ్విన్‌ వికెట్‌ తీశాడు. దాంతో విండీస్‌ కనీసం రెండొంద పరుగుల మార్కును చేరుకుండానే ఆలౌటైంది. మరొకవైపు విండీస్‌ తన క్రికెట్‌ చరిత్రలో రెండో అతిపెద్ద పరాజయాన్ని చవిచూసింది. 2007లో ఇంగ్లండ్‌పై ఇన్నింగ్స్‌  283 పరుగుల ఓటమి తొలి స్థానంలో ఉండగా, ఆ తర్వాత ఇదే విండీస్‌కు అతిపెద్ద పరాజయం.

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ 649/9 డిక్లేర్‌

విండీస్‌ తొలి ఇన్నింగ్స్‌ 181 ఆలౌట్‌, రెండో ఇన్నింగ్స్‌  196 ఆలౌట్‌

ఇక్కడ చదవండి: అజహర్‌ తర్వాత కోహ్లినే

టీమిండియా రికార్డు ‘ఇన్నింగ్స్‌’

మరిన్ని వార్తలు