మైక్‌ హెసన్‌కు మళ్లీ నిరాశే..

17 Aug, 2019 15:40 IST|Sakshi

ఢాకా: టీమిండియా ప్రధాన కోచ్‌ పదవి కోసం రవిశాస్త్రితో పోటీపడి రెండో స్థానంలో నిలిచిన మైక్‌ హెసన్‌కు మరోసారి చుక్కెదురైంది. బంగ్లాదేశ్‌ క్రికెట్‌ ప్రధాన కోచ్‌ పదవి కోసం పోటీ పడ్డ హెసన్‌ అక్కడి కూడా నిరాశే ఎదురైంది. బంగ్లాదేశ్‌ కుదించిన హెడ్‌ కోచ్‌ల జాబితాలో హెసన్‌ ఉన్నప్పటికీ కోచ్‌గా మాత్రం ఎంపిక కాలేదు. బంగ్లాదేశ్‌ ప్రధాన కోచ్‌గా దక్షిణాఫ్రికా మాజీ కోచ్‌ రసెల్‌ డొమినిగో ఎంపికయ్యాడు. అనుభవం దృష్ట్యా దక్షిడొమినిగోకే తొలి ప్రాధాన్యత ఇవ్వగా, హెసన్‌ మాత్రం షార్ట్‌ లిస్ట్‌ వరకే పరిమితమయ్యాడు.

బంగ్లాదేశ్‌ ప్రధాని కోచ్‌ పదవి కోసం పోటీ పడిన వారిలో పాకిస్తాన్‌ మాజీ కోచ్‌ మికీ ఆర్థర్‌ కూడా ఉన్నారు. తన పదవీ కాలాన్ని పీసీబీ పొడిగించకపోవడంతో బంగ్లాదేశ్‌ కోచ్‌ పదవి కోసం ఆర్థర్‌ దరఖాస్తు చేసుకున్నాడు. అయితే తమ జట్టుకు ఎవరైతే ఎక్కువ అందుబాటులో ఉంటారనే అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకున్న బీసీబీ.. దానికి డొమినిగో ఇచ్చిన సమాధానంతో సంతృప్తి చెందింది.  తనకు ఎటువంటి సెలవులు అవసరం లేదని, జట్టుతో పాటే ఉంటానని డొమినిగో తెలపడంతో అతని ఎంపికకే మొగ్గుచూపింది. ఈ విషయాన్ని బీసీబీ అధ్యక్షుడు నజ్ముల్లా హసన్‌ స్సష్టం చేశారు. పలు కోణాలు పరిశీలించిన తర్వాత డొమినిగో తొలి స్థానంలో నిలిచాడని నజ్ముల్లా తెలిపారు. ఆగస్టు 21వ తేదీ నుంచి బంగ్లాదేశ్‌ జట్టుతో డొమినిగో క్రికెట్‌ ప్రయాణం ఆరంభం కానుంది.

మరిన్ని వార్తలు