ఇదంతా రాహుల్‌ ద్రవిడ్‌ సర్‌ వల్లే..

6 Dec, 2019 11:00 IST|Sakshi

న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జరుగనున్న ఐసీసీ అండర్‌-19 వరల్డ్‌కప్‌లో భాగంగా భారత జట్టకు ఎంపిక కావడంతో భారత యువ క్రికెటర్‌ యశస్వి జైస్వాల్‌ ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. తాను అండర్‌-19 వరల్డ్‌కప్‌కు ఎంపిక కావడం వెనుక మాజీ కోచ్‌, ఎన్‌సీఏ చీఫ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ కృషి ఎంతో ఉందన్నాడు. ఇప్పుడు తాను నిలకడగా పరుగులు చేస్తున్నానంటే అదంతా ద్రవిడ్‌ సర్‌ వల్లే అంటూ జైస్వాల్‌ స్పష్టం చేశాడు. ‘ ఆడే ప్రతీ బంతిపై ఫోకస్‌ పెట్టమని ద్రవిడ్‌ సర్‌ ఎప్పటికప్పుడు చెబుతూ ఉండేవారు. ఏ బంతిని నువ్వు ఎదుర్కొంటున్నావో అప్పుడు ఆ బంతిపై దృష్టి కేంద్రీకరించాలి అని చెప్పేవారు.

ముఖ్యంగా ప్రాక్టీస్‌ సెషనల్‌లో ఏ ఏరియాల్లో నేను బలహీనంగా ఉన్నానో వాటిని సరిచేసేవారు.  ఇలా ద్రవిడ్‌ సర్‌ చెప్పిన ప్రతీ విషయం నాకు చాలా ఉపయోగపడింది’ యశస్వి జైస్వాల్‌ పేర్కొన్నాడు. ఇక తన ప్రదర్శన గురించి జైస్వాల్‌ మాట్లాడుతూ.. ‘ నేను ప్రతీ మ్యాచ్‌ను ఒకే రకంగా ఆస్వాదిస్తాను. నేను కింది స్థాయిలో ఎంత సహజ సిద్ధంగా ఆడానో అదే ప్రదర్శనను రిపీట్‌ చేయడంపై ఫోకస్‌ చేస్తా. నా ఆటపైనే దృష్టి పెడతా.. ఫలితాలపై కాదు. నా అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడానికి శాయశక్తులా కృషి చేస్తా’ అని జైస్వాల్‌ తెలిపాడు. విజయ్‌ హజారే ట్రోఫీలో మూడు డబుల్‌ సెంచరీలతో  యశస్వి జైస్వాల్‌ ఆకట్టుకున్నాడు. అందులో ఒక డబుల్‌ సెంచరీ కూడా ఉంది. దాంతో అండర్‌-19 వరల్డ్‌కప్‌ జట్టులో ఎంపికకు మార్గం సుగమం అయ్యింది. అక్టోబర్‌లో జార్ఖండ్‌తో జరిగిన మ్యాచ్‌లో యశస్వి 203 పరుగులు సాధించాడు.  ఫలితంగా అంతర్జాతీయ, దేశవాళీ వన్డేల్లో కలిపి (లిస్ట్‌–ఎ మ్యాచ్‌లు) అతి పిన్న వయసులో (17 ఏళ్ల 292 రోజులు) డబుల్‌ సెంచరీ సాధించిన ఆటగాడిగా నిలిచాడు.

మరిన్ని వార్తలు