‘డ్రా’ దిశగా...

1 Sep, 2019 05:12 IST|Sakshi

రెడ్, గ్రీన్‌ మధ్య దులీప్‌ ట్రోఫీ మ్యాచ్‌

బెంగళూరు: దులీప్‌ ట్రోఫీలో భాగంగా ఇండియా గ్రీన్, ఇండియా రెడ్‌ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌ ‘డ్రా’ దిశగా సాగుతోంది. మూడో రోజు శనివారం ఆట ముగిసే సమయానికి ‘రెడ్‌’ తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్లకు 404 పరుగులు చేసింది. మహీపాల్‌ లోమ్‌రోర్‌ (126; 14 ఫోర్లు, 3 సిక్సర్లు) సెంచరీ సాధించగా... కరుణ్‌ నాయర్‌ (90; 16 ఫోర్లు) శతకం కోల్పోయాడు. ఆంధ్ర ఆటగాడు శ్రీకర్‌ భరత్‌ (38), అవేశ్‌ (34 బ్యాటింగ్‌), ఉనాద్కట్‌ (30) ఫర్వాలేదని పించారు.

ధర్మేంద్ర సింగ్‌ జడేజాకు 4 వికెట్లు దక్కాయి. మూడు రోజుల తర్వాత కూడా రెండు ఇన్నింగ్స్‌లు పూర్తి కాకపోవడంతో మ్యాచ్‌ ‘డ్రా’ కావడం ఖాయమైంది. ఆదివారం మ్యాచ్‌కు చివరి రోజు. ‘గ్రీన్‌’ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో సాధించిన 440 పరుగులకు ‘రెడ్‌’ మరో 36 పరుగుల దూరంలో ఉంది. అయితే చేతిలో ఒకే వికెట్‌ ఉండటంతో గ్రీన్‌ ఆధిక్యం సాధించే అవకాశాలున్నాయి. ఇదే జరిగితే గ్రీన్‌ జట్టుకు 3, రెడ్‌ జట్టుకు 1 పాయింట్‌ దక్కుతాయి. అప్పుడు చెరో 4 పాయింట్లతో ఈ రెండు జట్లు బ్లూ (2)ను వెనక్కి నెట్టి ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి.

మరిన్ని వార్తలు