సెయింట్ లూయిస్ (అమెరికా): కెయిన్స్ కప్ అంతర్జాతీయ మహిళల చెస్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్మాస్టర్ ద్రోణవల్లి హారిక వరుసగా నాలుగో ‘డ్రా’ నమోదు చేసింది. అంతర్జాతీయ మాస్టర్ (ఐఎం) ఎలిజబెత్ పెట్జ్ (జర్మనీ)తో జరిగిన నాలుగో గేమ్ను తెల్ల పావులతో ఆడిన హారిక 31 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించింది.
పది మంది మేటి క్రీడాకారిణుల మధ్య జరుగుతున్న ఈ టోర్నీలో నాలుగో రౌండ్ తర్వాత హారిక రెండు పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది. 3.5 పాయింట్లతో ప్రపంచ మాజీ చాంపియన్ అలెగ్జాండ్రా కొస్టెనిక్ (రష్యా) అగ్రస్థానంలో ఉంది.