తొలి దక్షిణాఫ్రికా కెప్టెన్‌గా డుప్లెసిస్‌

1 Feb, 2018 21:11 IST|Sakshi

డర్బన్‌: భారత్‌తో జరుగుతున్న తొలి వన్డేలో దక్షిణాఫ్రికా కెప్టెన్‌ డుప్లెసిస్‌ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. భారత్‌పై స్వదేశంలో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన తొలి దక్షిణాఫ్రికా కెప్టెన్‌గా డుప్లెసిస్‌ రికార్డు నమోదు చేశాడు. ఈ మ్యాచ్‌లో డుప్లెసిస్‌ 120 పరుగుల వ్యక్తిగత స్కోరును నమోదు చేశాడు. ఫలితంగా వారి దేశంలో భారత జట్టుపై అత్యధిక వ్యక్తిగత స్కోరు  సాధించిన దక్షిణాఫ్రికా కెప్టెన్‌గా నిలిచాడు.  ఓవరాల్‌గా భారత్‌పై అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన రెండో దక్షిణాఫ్రికా కెప్టెన్‌ డుప్లెసిస్‌.  

2005లో కోల్‌కతాలో గ్రేమ్‌ స్మిత్‌ అజేయంగా 134 పరుగులు సాధించాడు. అదే భారత్‌పై అత్యధిక దక్షిణాఫ్రికా వన్డే కెప్టెన్‌ ఇన్నింగ్స్‌. భారత్‌పై అత్యధిక స్కోర్లు సాధించిన దక్షిణాఫ్రికా కెప్టెన్లలో ఏబీ డివిలియర్స్‌ మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాడు. 2015లో చెన్నైలో జరిగిన వన్డేల్లో డివిలియర్స్‌(112) శతకం సాధించగా, ఆపై ముంబైలోని వాంఖేడే స్టేడియంలో డివిలియర్స్‌(119) మరో శతకం సాధించాడు.ప్రస్తుత తొలి వన్డేలో సఫారీలు 270 పరుగుల లక్ష్యాన్ని భారత్‌కు నిర్దేశించిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు