డు ప్లెసిస్‌ శతక్కొట్టుడు

1 Feb, 2018 20:23 IST|Sakshi
శతకం సాధించిన తర్వాత డు ప్లెసిస్‌ అభివాదం

డర్బన్‌: భారత్‌తో జరుగుతున్న తొలి వన్డేలో దక్షిణాఫ్రికా కెప్టెన్‌ డుప్లెసిస్‌ శతకం సాధించాడు. ఒకవైపు వికెట్లుపడుతున్నా  డుప్లెసిస్‌ నిలకడగా బ్యాటింగ్‌ చేసి సెంచరీ నమోదు చేశాడు. 101 బంతుల్లో 11 ఫోర్లతో సెంచరీ సాధించాడు. ఇది డు ప్లెసిస్‌కు తొమ్మిదో వన్డే సెంచరీ. చివరి ఓవర్‌లో డుప్లెసిస్‌(120;112 బంతుల్లో) అవుట్‌ కావడంతో దక్షిణాఫ్రికా 270 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.

ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన దక్షిణాఫ్రికా బ్యాటింగ్‌ ఎంచుకుంది. దాంతో ఇన్నింగ్స్‌ను డీకాక్‌, హషీమ్‌ ఆమ్లాలు ఆరంభించగా సఫారీలకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్‌ ఆమ్లా(16) తొలి వికెట్‌గా పెవిలియన్‌ చేరి నిరాశపరిచాడు. బూమ్రా బౌలింగ్‌లో ఆమ్లా వికెట్ల ముందు దొరికిపోయాడు. ఆపై సఫారీ ఇన్నింగ్స్‌ను డీకాక్‌-డు ప్లెసిస్‌లు ముందుకు తీసుకెళ్లారు. అయితే జట్టు స్కోరు 83 పరుగుల వద్ద డీకాక్‌(34) రెండో వికెట్‌గా అవుయ్యాడు. అటు తరువాత మర్‌క్రామ్‌(9), డుమినీ(12), మిల్లర్‌(7)లు స్వల్ప వ్యవధిలో పెవిలియన్‌కు చేరడంతో దక్షిణాఫ్రికా 134 పరుగుల వద్ద ఐదో వికెట్‌ను నష్టపోయింది. ఆ తరుణంలో క్రిస్‌ మోరిస్‌-డు ప్లెసిస్‌ జోడి ఇన్నింగ్స్‌ మరమ్మత్తులు చేపట్టింది. ఈ జంట 74 పరుగులు జోడించడంతో సఫారీలు రెండొందల మార్కును చేరారు. మోరిస్‌(37) ఆరో వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. కాగా, టెయిలెండర్ ఫెలూక్వాయో(27) సాయంతో డు ప్లెసిస్‌ సమయోచిత ఇన్నింగ్‌ ఆడి సెంచరీ చేశాడు.  దాంతో దక్షిణాఫ్రికా నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 269 పరుగులు చేసింది. భారత్‌ బౌలర్లలో కుల్దీప్‌ యాదవ్‌ మూడు వికెట్లు సాధించగా, చాహల్‌ రెండు వికెట్లు తీశాడు. ఇక బూమ్రా, భువనేశ్వర్‌లకు తలో వికెట్‌ దక్కింది.


బ్రేక్‌ ఇచ్చిన కుల్దీప్‌, చాహల్‌

ఆమ్లా తొలి వికెట్‌గా బూమ్రా బౌలింగ్‌లో అవుటైన తర్వాత టీమిండియా స్పిన్నర్లు కుల్దీప్‌, చాహల్‌లు సఫారీలను కట్టడి చేశారు. వీరిదర్దూ వరుస విరామాల్లో ఐదు వికెట్లు సాధించి దక్షిణాఫ్రికాకు కళ్లెం వేశారు.  డీకాక్, మర్‌క్రామ్‌లను చాహల్‌ అవుట్‌ చేయగా, డుమినీ, డేవిడ్‌ మిల్లర్‌, క్రిస్‌ మోరిస్‌లను కుల్దీప్‌ యాదవ్‌ పెవిలియన్‌కు పంపాడు. కాగా, డు ప్లెసిస్‌ బాధ్యతాయుత ఇన్నింగ్స్‌ ఆడటంతో సఫారీలు గౌరవప్రదమైన స్కోరు సాధించారు.

మరిన్ని వార్తలు