న్యూఢిల్లీ: టి20 ప్రపంచకప్కు ముందు విదేశీ గడ్డపై ఇటీవలి కాలంలో భారత జట్టు దారుణ పరాజయాలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. దీంతో చీఫ్ కోచ్ డంకన్ ఫ్లెచర్ను తప్పించాల్సిందే అంటూ సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. అయితే వీటినేమాత్రం పట్టించుకోకుండా బీసీసీఐ ఫ్లెచర్కు తీపి కబురును అందించాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. 2015లో ఆస్ట్రేలియా-న్యూజిలాండ్లలో జరిగే వన్డే ప్రపంచకప్ వరకు డంకన్ ఫ్లెచర్నే కోచ్గా కొనసాగించాలనే యోచనలో ఉన్నట్టు తెలిసింది.
‘కోచ్ పదవిపై బోర్డు అన్ని విధాలా ఆలోచించి ఓ నిర్ణయానికొచ్చింది. ప్రస్తుత పరిస్థితుల్లో జట్టుకు కొత్త కోచ్ సరికాదని అనిపించింది. ఈ ఏడాది చివర్లో టీమిండియా... ఇంగ్లండ్, ఆసీస్ పర్యటనలకు వెళ్లాల్సి ఉంది. గత మూడేళ్లుగా ఫ్లెచర్ జట్టుతో పాటే ఉన్నారు. మరో ఏడాది ఆయనే కొనసాగితే జట్టుకు మంచిదని భావించాం’ అని బోర్డు ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు.