ప్రతీ మ్యాచ్‌ ఫైనల్‌ లాంటిదే

26 Dec, 2016 00:49 IST|Sakshi

హెన్రిక్‌ ఇంటర్వూ్య  
జర్మనీ క్లబ్‌ బొరుస్సియా డార్ట్‌మండ్‌ నుంచి గత జులైలో 30 మిలియన్‌ డాలర్ల ఒప్పందంతో హెన్రిక్‌ మిఖితర్యాన్‌ మాంచెస్టర్‌ యునైటెడ్‌కు తరలివచ్చాడు. అయితే అప్పటి నుంచి జట్టుకు అతడి సేవలు పెద్దగా ఉపయోగపడింది లేదు. గాయాలతో పాటు తుది జట్టులో చోటు దక్కకుండా పోవడం ఓ కారణం. అయితే నేడు సండర్‌లాండ్‌తో జరిగే మ్యాచ్‌లో కీలకంగా రాణించే ఆటగాళ్లలో తనూ ఒక్కడిగా మారాడు. ఈ నేపథ్యంలో మున్ముందు తాను మెరుగ్గా రాణించి ఆకట్టుకుంటానని అంటున్నాడు.

వచ్చే ఏడాది మీ జట్టుకు చాలా కీలకం కానుంది. ప్రీమియర్‌ లీగ్‌ పట్టికపై క్రిస్మస్‌ గేమ్స్‌ చాలా ప్రభావం చూపిస్తాయి. సండర్‌లాండ్‌పై విజయం సాధించగలరనుకుంటున్నారా?
2017 మా జట్టుకే కాకుండా ఆటగాళ్లకు, అభిమానులకు అద్భుతంగా సాగాలని కోరుకుంటున్నాను. ఈ సీజన్‌ను కూడా మెరుగ్గా ముగిస్తాం.

టైటిల్‌ రేసులో వెనుకబడిన మీ జట్టుకు చాంపియన్‌ అయ్యే అవకాశాలున్నాయా?
మేమింకా మా ప్రయత్నాలను వదులుకోలేదు. పోటీలో లేమని మేం చెప్పడం లేదు. ఇంకా చాలా మ్యాచ్‌లు ఆడాల్సి ఉన్నాయి. టాప్‌–4లో నిలిచేందుకు ప్రయత్నిస్తున్నాం.

జట్టులో చాలా కాలం తర్వాత చోటు దక్కించుకున్నారు. మీ వ్యక్తిగత లక్ష్యాలు ఏమిటి?
జట్టు కోసం నా శాయశక్తులా పోరాడటమే నా ముందున్న లక్ష్యం. ఈపీఎల్‌లో ప్రతీ మ్యాచ్‌ ఫైనల్‌లాంటిదే. అందుకే శక్తివంచన లేకుండా ఆడాల్సి ఉంటుంది.

ఇప్పటిదాకా మీ కెరీర్‌పై అత్యంత ప్రభావం చూపిన వ్యక్తి ఎవరు?
అందరికంటే ఎక్కువగా మా నాన్న ప్రభావం ఉంది. ఆయన మాజీ ఫుట్‌బాలర్‌. తను చనిపోయిన తర్వాత ఆయన అడుగుజాడల్లో నడవాలని నిర్ణయించుకున్నాను.

మరిన్ని వార్తలు