సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ హ్యాండ్బాల్ స్కూల్ లీగ్లో ఏకలవ్య, గ్రీన్ ఓక్స్ స్కూల్ జట్లు సెమీస్కు చేరుకున్నాయి. సనత్నగర్ జీహెచ్ఎంసీ మినీ స్టేడియంలో గురువారం జరిగిన బాలికల క్వార్టర్స్ మ్యాచ్లో ఏకలవ్య స్కూల్ 5–3తో గతి స్కూల్పై, గతి ప్రభుత్వ పాఠశాల 7–3తో జేహెచ్పీఎస్, జూబ్లీహిల్స్పై, జీహెచ్ఎస్ పికెట్ స్కూల్ 9–4తో భారతీయ విద్యాభవన్పై, సీఎంఆర్ ఇంటర్నేషనల్ స్కూల్ 7–3తో మమత హైస్కూల్పై గెలుపొందాయి. బాలుర క్వార్టర్స్ మ్యాచ్ల్లో గ్రీన్ ఓక్స్ స్కూల్ 5–4తో సీహెచ్ఆర్హెచ్ఎస్పై, బ్లూ డైమండ్ స్కూల్ 6–3తో లిటిల్ స్కాలర్స్పై నెగ్గి సెమీస్కు చేరుకున్నాయి. ఈ పోటీలను రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ టోర్నీలో వివిధ ప్రాంతాలకు చెందిన 25 బాలుర, 16 బాలికల జట్లు పాల్గొన్నాయి.
క్రీడాభివృద్ధికి కేంద్రం సహకరించాలి: తలసాని
కేంద్రం ప్రత్యేక నిధులను కేటాయించి రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి సహకరించాలని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ క్రీడలు అందరి జీవితాల్లో భాగం కావాలని ఆకాంక్షించారు. ఆటల్లో గెలుపోటములు సహజమని, క్రీడాకారులు స్ఫూర్తితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు క్రీడలకు ఎనలేని ప్రాధాన్యం ఇస్తున్నారని కొనియాడారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో రాణించే క్రీడాకారులకు తగిన ప్రోత్సాహకాలు అందిస్తూ వారు మరింత ఉన్నతంగా రాణించేందుకు కృషిచేస్తున్నారన్నారు.
విద్యార్థులు ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సనత్నగర్ కార్పొరేటర్ కొలను లక్ష్మీ బాల్రెడ్డి, భారత హ్యాండ్బాల్ సమాఖ్య (హెచ్ఎఫ్ఐ) కార్యదర్శి ఆనందేశ్వర్ పాండే, రాష్ట్ర హ్యాండ్బాల్ సంఘం కార్యదర్శి పవన్కుమార్, అంతర్జాతీయ హ్యాండ్బాల్ క్రీడాకారుడు ఎంఏ అజీజ్ తదితరులు పాల్గొన్నారు.