ఎంసీఎల్కు అనుమతించకపోవడంపై స్పందన
కరాచీ: మాస్టర్స్ చాంపియన్స్ లీగ్ (ఎంసీఎల్)లో ఆడేందుకు ఉత్సాహం చూపించిన పలువురు సీనియర్ పాకిస్తాన్ క్రికెటర్లకు ఆ దేశ బోర్డు షాక్ ఇచ్చింది. ఇప్పటి వరకు ఇంకా రిటైర్మెంట్ ప్రకటించని ఆటగాళ్లకు నిరభ్యంతర పత్రం (ఎన్ఓసీ) జారీ చేయబోమని బోర్డు ప్రకటించింది. అధికారికంగా రిటైర్మెంట్ ప్రకటించి, ఇకపై తాము పాకిస్తాన్కు ఆడాలనే ఆసక్తిని ప్రదర్శించమని లేఖ రాసి ఇస్తేనే ఎంసీఎల్లో ఆడవచ్చని స్పష్టం చేసింది. దాంతో పలువురు సీనియర్ ఆటగాళ్లు గంట వ్యవధిలోనే తమ రిటైర్మెంట్లను ప్రకటించడం విశేషం.
ఎంసీఎల్లో ఆడేందుకు వీరు ఎంత ఆసక్తి చూపిస్తున్నారో దీన్ని బట్టి అర్థమవుతోంది. వీరంతా ప్రస్తుత పాక్ జట్టులో రెగ్యులర్ ఆటగాళ్లు కాకపోయినా... ఇప్పటి వరకు రిటైర్మెంట్ ప్రకటించలేదు. అబ్దుల్ రజాక్, మొహమ్మద్ యూసుఫ్, ఇమ్రాన్ ఫర్హత్, తౌఫీక్ ఉమర్, యాసిర్ హమీద్ ఈ జాబితాలో ఉన్నారు.