ఇకపై కరోనా సబ్‌స్టిట్యూట్‌? 

31 May, 2020 01:17 IST|Sakshi

లండన్‌: కోవిడ్‌–19 మహమ్మారి కారణంగా అంతర్జాతీయ టెస్టు మ్యాచ్‌ల్లో ఒక ప్రత్యేకమైన మార్పును ఇంగ్లండ్‌ అండ్‌ వేల్స్‌ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ) ఆశిస్తోంది. ఇప్పటివరకు మ్యాచ్‌ల్లో ఆటగాడు గాయపడితే కన్‌కషన్‌ ప్లేయర్, సబ్‌స్టిట్యూట్‌ ఫీల్డర్లను చూశాం. కానీ ఇప్పడు ‘కరోనా వైరస్‌ రీప్లేస్‌మెంట్‌ (సబ్‌స్టిట్యూట్‌)’ను అనుమతించాల్సిందిగా అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ)ని ఈసీబీ కోరింది. తమ ప్రతిపాదనపై ఐసీసీ సానుకూలంగా స్పందిస్తుందని ఈసీబీ నమ్ముతోంది.

‘కోవిడ్‌–19 రీప్లేస్‌మెంట్‌ గురించి ఐసీసీ ఇంకా కొన్ని అంశాలను పరిగణలోకి తీసుకోవాలి. దీనిని అంగీకరించాల్సిన అవసరముంది. జూలైలో వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌కు ముందే ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తుందని మేం నమ్ముతున్నాం’ అని ఈసీబీ ఈవెంట్స్‌ డైరెక్టర్‌ స్టీవ్‌ ఎల్వర్తి అన్నారు. అయితే ఈ మార్పు నుంచి వన్డే, టి20లను మినహాయించినట్లు ఆయన పేర్కొన్నారు. కరోనా కారణంగా దేశవాళీ సీజన్‌ను ఆగస్టు నుంచి ప్రారంభించనున్న ఈసీబీ... బయో సెక్యూర్‌ వాతావరణంలో వెస్టిండీస్, పాకిస్తాన్‌లతో టెస్టు సిరీస్‌లను నిర్వహిస్తామని పేర్కొంది. ఇంగ్లండ్‌ ప్రభుత్వ అనుమతి, మార్గదర్శకాల ఆధారంగానే టోర్నీలు జరుపుతామని చెప్పింది. 

మరిన్ని వార్తలు