ఓల్డ్ ట్రాఫోర్డ్: యాషెస్ సిరీస్లో మూడో టెస్టు గెలిచి ఫుల్జోష్లో ఉన్న ఇంగ్లండ్ షాక్ తగిలింది. కాలిపిక్క గాయంతో ఇంగ్లండ్ ప్రధాన పేసర్ జేమ్స్ అండర్సన్ మొత్తం యాషెస్ సిరీస్ నుంచే వైదొలిగాడు. యాషెస్ తొలి టెస్టులోనే గాయంతో సతమతమైన అండర్సన్ కొన్ని ఓవర్లు పాటు మాత్రమే బౌలింగ్ వేశాడు. ఆపై అర్థాంతరంగా ఫీల్డ్ నుంచి వెళ్లిపోయాడు. ఇక రెండు, మూడు టెస్టుల్లో సైతం అండర్సన్ కోలుకోలేకపోవడంతో తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. కాగా, లాంక్షైర్ సెకండ్ ఎలెవన్లో పాల్గొన్న అండర్సన్ బౌలింగ్ చేయడానికి ఇబ్బందులు పడ్డాడు. విపరీతమైన నొప్పితో బాధపడిన అండర్సన్ ఆ మ్యాచ్ మధ్య నుంచి తప్పుకున్నాడు. ఆ క్రమంలోనే అతనికి చికిత్స అనివార్యమైంది.
దీనిపై ఈసీబీ మెడికల్ విభాగం సమీక్ష నిర్వహించగా అండర్సన్ పూర్తిస్థాయిలో కోలుకోవడానికి కొన్ని వారాలు సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తేలింది. దాంతో యాషెస్ నుంచి అండర్సన్ వైదొలుగుతున్నట్లు ఈసీబీ ప్రకటించింది. యాషెస్ సిరీస్ తొలి టెస్టులో ఆసీస్ విజయం సాధించగా, రెండో టెస్టు డ్రాగా ముగిసింది. ఇక మూడో టెస్టులో ఇంగ్లండ్ అద్భుతమైన విజయాన్ని సాధించి రేసులోకి వచ్చింది. ఈ రెండు జట్లకు నాల్గో టెస్టు అత్యంత కీలకం. ఇందులో పైచేయి సాధించిన జట్టు యాషెస్ను కైవసం చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దాంతో బుధవారం నుంచి ఆరంభమయ్యే నాల్గో టెస్టు కోసం ఆసీస్-ఇంగ్లండ్లు తీవ్ర కసరత్తులు చేస్తున్నాయి.