బెయిర్‌ స్టో గోల్డెన్‌ డక్‌

21 Jun, 2019 19:21 IST|Sakshi

లీడ్స్‌: వన్డే వరల్డ్‌కప్‌లో శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో ఇంగ్లండ్‌కు ఆదిలోనే షాక్‌ తగిలింది. ఓపెనర్‌ బెయిర్‌ స్టో గోల్డెన్‌ డక్‌గా పెవిలియన్‌ చేరాడు. శ్రీలంక నిర్దేశించిన 233 పరుగుల టార్గెట్‌ను ఛేదించే క్రమంలో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌ను బెయిర్‌ స్టో, జేమ్స్‌ విన్సేలు ఆరంభించారు. అయితే లంక సీనియర్‌ పేసర్‌ లసిత్‌ మలింగా వేసిన తొలి ఓవర్‌ రెండో బంతికి బెయిర్‌ స్టో ఎల్బీగా ఔటయ్యాడు. దీనిపై స్టో రివ్యూకు వెళ్లినా నిరాశే ఎదురు కావడంతో అతను భారంగా పెవిలియన్‌ వీడాడు. దాంతో పరుగు వద్దే ఇంగ్లండ్‌ తొలి వికెట్‌ను నష్టపోయింది. వరల్డ్‌కప్‌లో రెండుసార్లు గోల్డెన్‌ డక్‌గా ఔటైన నాల్గో ఇంగ్లండ్‌ ఆటగాడిగా బెయిర్‌ స్టో నిలిచాడుఈ వరల్డ్‌కప్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో బెయిర్‌ స్టో గోల్డెన్‌ డక్‌గా ఔటైన సంగతి తెలిసిందే.

అంతకుముందు టాస్‌ గెలిచిన శ్రీలంక నిర్ణీత ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 232 పరుగులు చేసింది. శ్రీలంక ఆటగాళ్లలో ఏంజెలో మాథ్యూస్‌(85 నాటౌట్‌)కు జతగా అవిష్కా ఫెర్నాండో(49), కుశాల్‌ మెండిస్‌(46)లు మాత్రమే మెరవడంతో ఆ జట్టు సాధారణ స్కోరుకే పరిమితమైంది. ఇంగ్లండ్‌ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్‌, మార్క్‌ వుడ్‌ తలో మూడు వికెట్లు సాధించగా, ఆదిల్‌ రషీద్‌కు రెండు వికెట్లు లభించాయి. క్రిస్‌ వోక్స్‌ వికెట్‌ తీశాడు.


 

మరిన్ని వార్తలు