మూడు పరుగులు కొట్టలేక చేతులెత్తేశారు..

9 Mar, 2019 15:23 IST|Sakshi

గుహవాటి: భారత మహిళలతో జరిగిన మూడు టీ20ల సిరీస్‌ను ఇంగ్లండ్‌ క్లీన్‌స్వీప్‌ చేసింది. శనివారం జరిగిన మూడో వన్డేలో ఇంగ్లండ్‌ మహిళలు పరుగు తేడాతో గెలిచి సిరీస్‌ను 3-0తో కైవసం చేసుకున్నారు. కడవరకూ ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో భారత్‌ మహిళలు పరాజయం చవిచూశారు. చివరి ఓవర్‌లో భారత్ విజయానికి మూడు పరుగులు అవసరం కాగా, ఆ లక్ష్యాన్ని సాధించడంలో విఫలమయ్యారు. ఇంగ్లండ్‌ నిర్దేశించిన 120 పరుగుల లక్ష్య ఛేదనలో స్మృతీ మంధాన(58; 39 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్సర్‌) హాఫ్‌ సెంచరీ సాధించగా, మిథాలీ రాజ్‌(30 నాటౌట్‌; 32 బంతుల్లో 4 ఫోర్లు) ఆకట్టుకోవడంతో భారత్‌ విజయం సాధిస్తుందనే అనుకున్నరంతా. అయితే ఇంగ్లండ్‌ అద్భుతంగా బౌలింగ్‌ చేసి భారత్‌ను కట్టడి చేసింది. కేట్‌ క్రాస్‌ వేసిన ఆఖరి ఓవర్‌లో తొలి మూడు బంతులకు పరుగులేమీ రాకపోగా, నాల్గో బంతికి భారతి ఫుల్మాలి ఔటైంది.  దాంతో చివరి రెండు బంతుల్లో భారత్‌ మూడు పరుగులు సాధించాల్సి వచ్చింది. అయితే ఐదో బంతికి అనుజా పాటిల్‌ ఔట్‌ కాగా, చివరి బంతికి శిఖా పాండే పరుగు మాత్రమే చేశారు. ఫలితంగా భారత్‌ పరుగు తేడాతో ఓటమి పాలై సిరీస్‌లో వైట్‌వాష్‌ అయ్యింది.

టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌  చేసిన ఇంగ్లండ్ మహిళలు నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 119 పరుగులు చేశారు.డానియల్లీ వ్యాట్‌(24), బీమౌంట్‌(29) అమీ ఎలెన్‌ జోన్స్‌(26), డంక్లీ బ్రౌన్‌( 14 నాటౌట్‌), ష‍్రబ్‌సోల్‌(10 నాటౌట్‌), హీథర్‌ నైట్‌(11) తలో చేయి వేసి పోరాడే స్కోరును భారత్‌ ముందుంచారు. అయితే భారత్‌ క్రీడాకారిణుల్లో మంధాన, మిథాలీ రాజ్‌ మినహా మిగతా వారు విఫలమయ్యారు. భారత్‌ 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 118 పరుగులకే పరిమితం కావడంతో ఓటమి తప్పలేదు.

మరిన్ని వార్తలు