వన్డేల్లో భారత్‌ ‘టాప్‌’ చేజారింది 

3 May, 2018 02:13 IST|Sakshi

ఇంగ్లండ్‌కు నం.1 ర్యాంకు 

దుబాయ్‌: టెస్టుల్లో అగ్రస్థానాన్ని పదిలం చేసుకున్న టీమిండియా వన్డేల్లో టాప్‌ ర్యాంకును కోల్పోయింది. ఐసీసీ విడుదల చేసిన తాజా వన్డే ర్యాంకింగ్స్‌లో ఇంగ్లండ్‌ నంబర్‌వన్‌ ర్యాంకుకు ఎగబాకింది. 2015–16, 2016–17 సీజన్‌లలోని వెయిటేజీతో ఏకంగా 8 పాయింట్లు మెరుగుపర్చుకున్న ఇంగ్లండ్‌ 125 రేటింగ్‌ పాయింట్లతో ‘టాప్‌’ లేపింది. భారత్‌ ఒక పాయింట్‌ కోల్పోయి 122 రేటింగ్‌ పాయింట్లతో రెండో స్థానానికి పడిపోయింది.

రెండో స్థానంలో ఉన్న దక్షిణాఫ్రికా(113) మూడో స్థానానికి దిగజారగా, న్యూజిలాండ్‌ (112) నాలుగో ర్యాంకులో ఉంది.  ప్రపంచ చాంపియన్‌ ఆస్ట్రేలియా (104) ఐదో ర్యాంకులో పాకిస్తాన్‌ (102) ఆరో ర్యాంకులో కొనసాగుతున్నాయి. ఐసీసీ టి20 ర్యాంకింగ్స్‌లో భారత్‌ (123) మూడో స్థానంలో ఉండగా... పాక్‌ (130), ఆస్ట్రేలియా (126) టాప్‌–2 ర్యాంకుల్లో ఉన్నాయి.   

మరిన్ని వార్తలు