ఇషా సింగ్‌కు రెండు స్వర్ణాలు

2 Aug, 2019 14:03 IST|Sakshi

మాస్టర్స్‌ షూటింగ్‌ చాంపియన్‌షిప్‌  

సాక్షి, హైదరాబాద్‌: సర్దార్‌ సజ్జన్‌ సింగ్‌ సేథీ స్మారక మాస్టర్స్‌ షూటింగ్‌ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ షూటర్లు ఇషా సింగ్, ధనుశ్‌ శ్రీకాంత్‌ అద్భుత ప్రదర్శన కనబరిచారు. న్యూఢిల్లీలో జరుగుతోన్న ఈ టోర్నీలో ఇషా సింగ్‌ రెండు స్వర్ణ పతకాలతో సత్తా చాటగా... ధనుశ్‌ రజతం, కాంస్య పతకాలతో ఆకట్టుకున్నాడు. మహిళల 10మీ. ఎయిర్‌ పిస్టల్‌ ఈవెంట్‌లో ఇషా సింగ్‌ 239.5 పాయింట్లు స్కోర్‌ చేసి విజేతగా నిలిచింది. రుచిత (రైల్వేస్‌; 238 పాయింట్లు), నివేథ (తమిళనాడు; 217 పాయింట్లు) వరుసగా రజత, కాంస్య పతకాలను గెలుచుకున్నారు.

జూనియర్‌ మహిళల 10మీ. ఎయిర్‌ పిస్టల్‌ విభాగం ఫైనల్లో ఇషా సింగ్‌ 239.7 పాయింట్లతో పసిడి పతకాన్ని కైవసం చేసుకోగా... ప్రియ(హరియాణా; 237 పాయింట్లు) రజతాన్ని, ఖుషీరత్‌ (పంజాబ్‌; 217 పాయింట్లు) కాంస్యాన్ని అందుకున్నారు. పురుషుల 10మీ. ఎయిర్‌ రైఫిల్‌ ఈవెంట్‌లో ధనుశ్‌ శ్రీకాంత్‌ 248.6 పాయింట్లు స్కోర్‌ చేసి రజతాన్ని సాధించాడు. యూత్‌ మెన్‌ 10మీ. ఎయిర్‌ రైఫిల్‌ ఈవెంట్‌లో ధనుశ్‌ 227.7 పాయింట్లతో మూడోస్థానంతో సరిపెట్టుకున్నాడు. 

మరిన్ని వార్తలు