పెర్త్‌ టెస్ట్‌: కోహ్లి, పైన్‌ల మాటల యుద్దం!

17 Dec, 2018 08:49 IST|Sakshi

పెర్త్‌: భారత్‌-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న రెండో టెస్ట్‌లో ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య మాటల యుద్దం మొదలైంది. తొలి ఇన్నింగ్స్‌లో వివాదాస్పద రీతిలో ఔటైన టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి.. ఆసీస్‌ రెండో ఇన్నింగ్స్‌లో తన నోటికి పనిచెప్పాడు. మూడో రోజు ఆటలో భాగంగా ఆసీస్‌ కెప్టెన్‌ టీమ్‌ పైన్‌పై నోరుపారేసుకున్నాడు. పలుమార్లు ఔటవ్వకుండా తప్పించుకున్న పైన్‌ దగ్గరకు వెళ్లి.. ‘మీరు ఇలా ఆడితే సిరీస్‌ 2-0గా మారుతుంది’ అని హెచ్చరించాడు. దీనికి పైన్‌ సైతం అదే రీతిలో బదులిచ్చాడు. ‘మీరు ముందు బ్యాటింగ్‌ చేయాల్సింది కదా బిగ్‌హెడ్‌‌’ అని కోహ్లి మాటలను తిప్పి కొట్టాడు. ఇవి స్టంప్స్‌ మైక్‌లో రికార్డయ్యాయి. ఇక దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది.  ఇది మూడో రోజు ఆట చివరి ఓవర్‌లో చోటు చేసుకుంది.

మాములుగా ఆసీస్‌ అంటే ఊగిపోయే కోహ్లి.. ఈ సారి కూడా అలానే రెచ్చిపోయాడు. అటు బ్యాట్‌తోను రాణించాడు. శతకం బాది ఆసీస్‌కు తన సత్తా ఏంటో చూపించాడు. కానీ అంపైర్‌ తప్పుడు నిర్ణయానికి బలైన కోహ్లి.. అసహనం వ్యక్తం చేస్తూనే మైదానం వీడాడు. ఇక తొలి ఇన్నింగ్స్‌లో 43 పరుగుల ఆధిక్యం సాధించిన ఆసీస్‌.. మూడో రోజు ఆట ముగిసే సమయానికి నాలుగు వికెట్లు కోల్పోయి 132 పరుగులు చేసింది.

ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌ 326 ఆలౌట్‌
భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ 283 ఆలౌట్‌

 

మరిన్ని వార్తలు