నగరంలో ఐసీసీ ప్రపంచకప్ ప్రదర్శన

6 Jan, 2015 00:42 IST|Sakshi
నగరంలో ఐసీసీ ప్రపంచకప్ ప్రదర్శన

కేపీహెచ్‌బీ కాలనీ: నగరంలో సోమవారం ఐసీసీ వరల్డ్ కప్ ట్రోఫీ సందడి చేసింది. టోర్నీ గ్లోబల్ స్పాన్సర్ ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ సంస్థ ఆధ్వర్యంలో కూకట్‌పల్లి హౌజింగ్ బోర్డు కాలనీలోని ఫోరం మాల్‌లో ఈ ట్రోఫీని ప్రదర్శించారు. కప్‌ను చూసేందుకు వచ్చిన క్రికెట్ అభిమానులు టీమిండియాకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా భారత్ విజయాన్ని కాంక్షిస్తూ 30 అడుగుల పొడవైన బ్యాట్‌పై పలువురు అభిమానులు  సంతకాలు చేశారు.

ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ సంస్థ హైదరాబాద్ బ్రాంచ్ మేనేజర్ శశికిరణ్, ఆర్‌ఆర్‌ఎం అచింట్ రాణే తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా ఐదు నగరాల్లో ఈ ట్రోఫీ ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. కోల్‌కతా, హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, నోయిడాల్లో ట్రోఫీని ప్రదర్శిస్తారు.  ఫిబ్రవరి 14 నుంచి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లలో ప్రపంచకప్ జరుగుతుంది.

>
మరిన్ని వార్తలు