డబ్లిన్: టీమిండియా ఆడబోయే తదపరి నాలుగు టీ20ల్లో చాలా ప్రయోగాలు ఉంటాయని కెప్టెన్ విరాట్ కోహ్లి స్పష్టం చేశాడు. ప్రధానంగా మిడిల్ ఆర్డర్లో భారీ ప్రయోగాలు చేయబోతున్న విషయాన్ని కోహ్లి సూచన ప్రాయంగా తెలిపాడు. ఈ క్రమంలోనే ప్రతీ ఒక్క ఆటగాడికి బ్యాటింగ్ చేసే అవకాశం దక్కుతుందని కోహ్లి భరోసా ఇచ్చాడు. ఐర్లాండ్తో తొలి టీ20 తర్వాత మాట్లాడిన కోహ్లి.. అవకాశం రాని జట్టు సభ్యులు మిగతా మ్యాచ్లు ఆడటానికి సిద్ధంగా ఉండాలన్నాడు.
‘మేము ఆడబోయే(ఇంగ్లండ్తో మూడు టీ20ల సిరీస్తో కలుపుకుని) మా ఓపెనింగ్ కాంబినేషన్ ఎలా ఉంటుందో ఇప్పటికే ప్రకటించాం. కానీ మిడిల్ ఆర్డర్లో మాత్రం భారీ ప్రయోగాలు ఖాయం. పరిస్థితుల్ని బట్టి తుది జట్టులో మార్పులు చేస్తాం. ఇక్కడ కాంబినేషన్ల ప్రకారం జట్టును ప్రయోగించడానికి సిద్ధంగా ఉన్నాం. మనం ప్రయోగాలు చేసి ప్రత్యర్థి జట్టును ఆశ్చర్యానికి గురి చేద్దాం. ఒక మ్యాచ్లో ఎవరికైతే అవకాశం రాదో.. వారికి తదుపరి మ్యాచ్లో కచ్చితంగా అవకాశం ఉంటుంది. ఇది జట్టు మేనేజ్మెంట్ నిర్ణయం. ఈ నిర్ణయంతో ఆటగాళ్లంతా సంతోషంగా ఉన్నారు. ఆటగాళ్లు అవకాశం వచ్చే వరకూ ఓపిక పట్టండి’ అని కోహ్లి తెలిపాడు.