నేను సెలక్ట్‌ అవుతాననే అనుకున్నా: శుబ్‌మన్‌

23 Jul, 2019 13:56 IST|Sakshi

న్యూఢిల్లీ: వెస్టిండీస్‌-ఏ జట్టుతో జరిగిన ఐదు వన్డేల అనధికారిక సిరీస్‌లో టాప్‌ స్కోరర్‌గా నిలిచిన టీమిండియా యువ ఆటగాడు శుబ్‌మన్‌ గిల్‌ జాతీయ జట్టులో తిరిగి చోటు దక్కుతుందని ఆశించి భంగపడ్డాడు. విండీస్‌ పర్యటనకు వెళ్లే భారత జట్టులో చోటు దక్కుతుందని ఆశించానని, అయితే అది జరగకపోవడంతో నిరాశకు గురైనట్లు పేర్కొన్నాడు. ‘ భారత జట్టులో పునరాగమనం కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూశా. నేను సెలక్ట్‌ అవుతాననే అనుకున్నా. కనీసం  భారత సెలక్టర్లు ప్రకటించిన ఏదొక జట్టులో చోటు దక్కుతుందనే భావించా. కానీ నేను ఎంపిక కాలేదు. ఇది నన్ను చాలా నిరుత్సాహానికి గురి చేసింది.

కాకపోతే దాని కోసం ఆలోచిస్తూ కూర్చోను. నా ముందన్న లక్ష్యం సెలక్టర్లను ఆకర్షించడమే. అలా చేయాలంటే బ్యాట్‌తో ఆకట్టుకోవాలి.  మళ్లీ జాతీయ జట్టులో ఎంపిక కావడానికి నా శాయ శక్తులా కృషి చేస్తా’ అని గిల్‌ పేర్కొన్నాడు. విండీస్‌ పర్యటనలో భాగంగా పరిమిత ఓవర్ల సిరీస్‌ల్లో గిల్‌ను ఎంపిక చేయలేదు. వరల్డ్‌కప్‌లో నిరాశపరిచిన కేదార్‌ జాదవ్‌ను ఎంపిక చేసేందుకే మొగ్గుచూపిన ఎంఎస్‌కే ప్రసాద్‌ నేతృత్వంలోని సెలక్షన్‌ కమిటీ.. గిల్‌ను పక్కకు పెట్టేసింది. కాగా, గిల్‌ ఎంపిక చేయకపోవడంపై విమర్శలు రావడంతో ఎంఎస్‌ఏ ప్రసాద్‌ స్పందించాడు.  ఇంకా గిల్‌ వెయిటింగ్‌ లిస్ట్‌లో ఉన్నాడంటూ సమర్ధించుకునే యత్నం చేశాడు.

మరిన్ని వార్తలు