కోహ్లిని ఇబ్బంది పెట్టిన అభిమాని

19 Sep, 2019 14:08 IST|Sakshi

మొహాలి : దక్షిణాఫ్రికాతో బుధవారం జరిగిన రెండో టి20 మ్యాచ్‌లో భారత్‌ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.  భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ఆఫ్‌ సెంచరీతో మ్యాచ్‌ను గెలిపించి మ్యాన్‌ ఆఫ్‌ది మ్యాచ్‌గా నిలిచాడు.  అదే సమయంలో అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు సాధించిన జాబితాలో కోహ్లి అగ్రస్థానానికి చేరుకున్నాడు. ప్రస్తుతం కోహ్లి 2,441 పరుగులతో టాప్‌కు ఎగబాకాడు. ఇక్కడ మరో భారత ఆటగాడు రోహిత్‌ శర్మను దాటేశాడు. రోహిత్‌ శర్మ అంతర్జాతీయ టీ20ల్లో 2,434  పరుగులు సాధిస్తే, దాన్ని  తాజాగా కోహ్లి బ్రేక్‌ చేశాడు. మరొకవైపు అంతర్జాతీయ టీ20 హాఫ్‌ సెంచరీల్లో సైతం రోహిత్‌ను అధిగమించాడు కోహ్లి.  ఇప్పటివరకూ రోహిత్‌ శర్మ 21 అర్థ శతకాలు సాధిస్తే, కోహ్లి దాన్ని సవరించాడు.

కాగా, ఈ మ్యాచ్‌లో కోహ్లి బ్యాటింగ్‌ చేస్తుండగా ఓ అభిమాని స్టేడియంలోకి దూసుకొచ్చాడు. కోహ్లితో కరచాలనం చేయాలని ప్రయత్నించాడు. అది చూసి కోహ్లి వెనక్కు తగ్గాడు. ఇంతలో సెక్యూరిటీ గార్డులు వచ్చి అభిమానిని బయటికి తీసుకెళ్లిపోయారు. అంతకు ముందు ప్రొటీస్‌ బ్యాటింగ్‌ చేస్తున్నప్పుడు కూడా ఓ వ్యక్తి స్టేడియంలోకి వచ్చాడు. ఇలా రెండు సార్లు జరుగడంతో ఆటగాళ్ల భద్రతపై క్రికెట్‌ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

మరిన్ని వార్తలు