-

శంకర్‌.. టెన్నిస్‌ బాల్‌తో క్రికెట్‌ ఆడుకో 

19 Mar, 2018 16:59 IST|Sakshi
విజయ్‌ శంకర్‌

సోషల్‌ మీడియా వేదికగా అభిమానుల ఫైర్‌

శంకర్‌ను బతికించిన కార్తీక్‌!

సాక్షి, స్పోర్ట్స్‌ : నిదహాస్‌ ట్రోఫీలో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన ఉత్కంఠకర మ్యాచ్‌లో వికెట్‌ కీపర్‌ దినేశ్‌ కార్తీక్‌ అద్భుత ప్రదర్శనతో భారత్‌ గట్టెక్కిన విషయం తెలిసిందే. అయితే మ్యాచ్‌ను గెలిపించిన కార్తీక్‌పై ప్రశంసల జల్లు కురుస్తుండగా.. జిడ్డు బ్యాటింగ్‌తో భారత్‌ను ఓటమి అంచులకు చేర్చిన యువ ఆల్‌రౌండర్‌ విజయ్‌ శంకర్‌పై మిమర్శల పర్వం కొనసాగుతోంది.

అసలే అది ఉత్కంఠకర టీ20 మ్యాచ్‌.. పైగా ఫైనల్‌ మ్యాచ్‌ కూడా.. ఈ తరుణంలో ప్రతి బంతిని బౌండరీకి తరలించాల్సింది పోయి.. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా నాలుగు బంతులు డాట్‌ చేయడంతో విజయ్‌ శంకర్‌పై అభిమానుల ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది. మ్యాచ్‌ గెలిచినా అభిమానులకు శంకర్‌పై ఉన్న కోపం తగ్గలేదు. ఇంకేముంది సోషల్‌ మీడియా వేదికగా తమ ఆగ్రహాన్ని వెల్లగక్కారు. 

అసలు నిన్నెవరు(శంకర్‌) సెలక్ట్‌ చేసిందని, గల్లీ క్రికెటర్‌వి అంటూ తీవ్ర పదాజాలంతో విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక ఈ మ్యాచ్‌ ఓడిపోయి ఉంటే శంకర్‌ కెరీర్‌ ప్రశ్నార్థకంగా మారేదని, దినేశ్‌ కార్తీక్‌ మ్యాచ్‌ను గెలిపించడమే కాదు.. శంకర్‌ను కాపాడాడని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అతని అరంగేట్ర సిరీస్‌లోనే వీడ్కోలు జరిగేదని, శంకర్‌ నీవు టెన్నిస్‌ బాల్‌తో క్రికెట్‌ ఆడుకోవడం మంచిదని ఇంకొందరు కామెంట్‌ చేస్తున్నారు.

మరిన్ని వార్తలు