ఆట ఆడటానికా ? ఫొటో షూట్‌ కోసమా?

19 Aug, 2018 10:24 IST|Sakshi
పాండ్యా షేర్‌ చేసిన ఫొటో

ఆల్‌రౌండర్‌ పాండ్యాపై నెటిజన్ల ఫైర్‌

నాటింగ్‌హామ్‌ : ఇంగ్లండ్‌ పర్యటనలో ఉన్న టీమిండియా ఆల్‌రౌండర్‌ హర్థిక్‌ పాండ్యాపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు అక్కడికి వెళ్లింది ఆట ఆడటానికా ? లేక ఫొటో షూట్‌ కోసమా అని ఘాటుగా ప్రశ్నిస్తున్నారు. పాండ్యా తన ఖాళీ సమయాన్ని లండన్‌ వీధుల్లో తిరుగుతూ ఆస్వాదించాడు. దీనికి సంబంధించిన ఓ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు. ఇది అభిమానులకు ఎక్కడి లేని ఆగ్రహాన్ని తెప్పించింది. టెస్ట్‌ సిరీస్‌ల్లో ఇప్పటికే రెండు మ్యాచ్‌లు ఓడి కష్టాల్లో ఉన్న భారత్‌ను గట్టెక్కించాల్సిన ప్రయత్నం చేయకుండా ఇలా ఎంజాయ్‌ చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఇంగ్లండ్‌ టూర్‌ ఆడటానికి వచ్చాననే విషయాన్ని గుర్తు చేసుకో అని మండిపడుతున్నారు. ఇలా సమయాన్ని వృథా చేయకుండా నెట్స్‌లో ప్రాక్టీస్‌ చేయమని సలహాలిస్తున్నారు. ‘ఈ ఫొటో షూట్స్ తరువాత కానీ.. ముందు ఆట మీద దృష్టి సారించూ’ అని గట్టిగానే క్లాస్‌ పీకుతున్నారు. ( చదవండి:పాండ్యాను ఆల్‌రౌండర్‌ అనలేం)

ఈ సిరీస్‌లో పాండ్యా తన స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేకపోయాడు. తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 52 పరుగులు చేసిన ఈ ఆల్‌రౌండర్‌ ఒక్క వికెట్‌ కూడా పడగొట్టలేకపోయాడు. రెండో టెస్టులో 11, 26 పరుగులు చేసి విఫలమైనా.. బౌలింగ్‌లో 3 వికెట్లు పడగొట్టి పర్వాలేదనిపించాడు. అయితే ఈ మ్యాచ్‌లో భారత్‌ ఇన్నింగ్స్‌,159 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. నిజానికి ఈ రెండు టెస్టుల్లో కోహ్లి మినహా బ్యాట్స్‌మన్‌ అంతా దారుణంగా విఫలమైన విషయం తెలిసిందే. శనివారం ప్రారంభమైన మూడో టెస్టులో కోహ్లి-రహానే జోడీ భారత ఇన్నింగ్స్‌ను నిలబెట్టింది. ఈ మ్యాచ్‌లోను పాండ్యా(18) నిరాశపరిచాడు. తొలి రోజు ఆటముగిసే సమయానికి భారత్‌ 6 వికెట్లు కోల్పోయి 307 పరుగులు చేసింది.

చదవండి: మూడో టెస్టు ముచ్చట్లు !

మరిన్ని వార్తలు