ద్రవిడ్‌ను పీఎం చేయండి!

27 Feb, 2018 12:49 IST|Sakshi

టీమిండియా బ్యాటింగ్‌ దిగ్గజం, విజయవంతమైన జూనియర్‌ జట్ల కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌పై ఇప్పుడు సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. అండర్‌–19 ప్రపంచకప్‌లో భారత జట్టు విజేతగా నిలిచేందుకు తోడ్పడిన శిక్షణ సిబ్బందికి సమాన ప్రోత్సాహాకాన్ని ఇవ్వనున్నట్లు బీసీసీఐ ప్రకటించిన తర్వాత మరోసారి టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా మారిపోయాడు రాహుల్‌ ద్రవిడ్‌. ఎంతలా అంటే ద్రవిడ్‌ దేశానికి పీఎం అయితే సమానత్వాన్ని బాగా అమలు పరచగలడని అభిమానులు ట్విటర్‌ వేదికగా ప్రశంసల వర్షం కురిపించేంతగా. ద్రవిడ్‌ ఒక ప్రధాని స్థాయి వ్యక్తి అంటూ ఒక అభిమాని పేర్కొనగా, పీఎంగా అతన్ని గౌరవించాలని మరొక అభిమాని పేర్కొన్నాడు. ద్రవిడ్‌ను పీఎం చేస్తారని ప్రామిస్‌ చేస్తే పార్టీతో సంబంధం లేకుండా ఓటేస్తానని మరొకరు ట్వీట్‌ చేశారు. ద్రవిడ్‌ అవసరం భారత్‌కు ఉందని, అయితే పీఎంగా చేయాలనుకోవడం సరైనది కాదని మరొకరు అన్నారు. ఇలా భిన్నాభిప్రాయాల మధ్య రాహుల్‌ ద్రవిడ్‌-పీఎం చర్చ వాడివాడిగా నడుస్తోంది.


వరల్డ్‌ కప్‌క గెలవగానే బోర్డు... ఆటగాళ్లకు రూ 30 లక్షలు, హెడ్‌ కోచ్‌ ద్రవిడ్‌కు రూ. 50 లక్షలు, సహాయ సిబ్బందికి రూ. 20 లక్షల చొప్పున ప్రోత్సాహకాల్ని ప్రకటించింది. దీనిపై ద్రవిడ్‌ అసంతృప్తి వెలిబుచ్చాడు. జట్టు కోసం తన సిబ్బంది అంతా సమష్టిగా శ్రమించారని, ఈ ఫలితంలో పేరొచ్చినా... ప్రోత్సాహకం వచ్చినా సమానంగా దక్కాల్సిందేనని డిమాండ్‌ చేశాడు. దిగ్గజ ఆటగాడి మాటకు విలువిచ్చిన బీసీసీఐ... ఏడాదికి పైగా యువ జట్టుకు సేవలందించిన కోచింగ్‌ సిబ్బందికి సమాన నజరానాలు ఇచ్చేందుకు ముందుకు రావడంతో ద్రవిడ్‌పై అభిమాన వర్షం కురుస్తోంది.ఇప్పడు భారత జట్టు విజయానికి కృషి చేసిన వారందరికీ తలో రూ. 25 లక్షల చొప్పున అందనున్నాయి.

>
మరిన్ని వార్తలు