ట్వీట్‌లు వద్దయ్యా.. డొనేట్‌ చేయండి!

20 Jul, 2019 19:44 IST|Sakshi

న్యూఢిల్లీ : అసోంలో కురుస్తున్న భారీ వర్షాలకు నదులు పొంగిపొర్లుతున్నాయి. వరదల ఉధృతికి పదుల సంఖ్యలో మృత్యువాత పడగా.. లక్షలమంది నిరాశ్రయులయ్యారు. మొత్తం 33 జిల్లాల్లో ఎన్నడూ లేనివిధంగా వరద ప్రభావం కొనసాగుతోంది. వీటన్నంటిని మించి వేల ఎకరాల్లో విస్తరించి ఉన్న కజిరంగ నేషనల్ పార్క్ 90 శాతం జలమయం అయింది. ఇలాంటి పరిస్థితుల్లో అసోంను చూసి బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ చలించిపోయారు. వెంటనే అసోంకు రూ.2 కోట్ల భారీ విరాళం ప్రకటించారు. అందులో కోటి రూపాయలు అసోం ముఖ్యమంత్రి సహాయనిధికి, మరో కోటి రూపాయలు కజిరంగ నేషనల్ పార్క్‌కు విరాళంగా అందించారు. అంతేగాకుండా, తాను సాయం చేశానని, అందరూ సాయం చేయండి అంటూ ట్విటర్‌ ద్వారా నెటిజన్లకు విజ్ఞప్తి చేశారు. భారత స్పింటర్‌ హిమ దాస్‌ సైతం తనకు తోచిన సాయం ప్రకటించింది. అసోం ముఖ్యమంత్రి సహాయ నిధికి తన నెల జీతంలో సగం డబ్బును విరాళంగా ఇస్తున్నట్లు ట్వీట్ చేసింది. ‘‘అసోంలో వరదల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. 33 జిల్లాల్లో 30 జిల్లాలు ప్రస్తుతం ఇబ్బందులు ఎదుర్కుంటున్నాయి. ఈ కష్ట సమయంలో మా రాష్ట్రాన్ని ఆదుకోవాలని అందరిని కోరుతున్నాను’అని హిమ ట్వీట్‌లో పేర్కొంది.

ఇలా అందరూ తమకు తోచిన సాయం చేస్తూ విరాళాలివ్వాలని అభిమానులను కోరుతుండగా.. టీమిండియా క్రికెటర్లు విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌లు మాత్రం.. అసోంలోని పరిస్థితులు చూస్తే గుండె తరుక్కుపోతుందని కేవలం ట్వీట్‌తో సరిపెట్టారు. క్రికెట్‌ ఆటతో కోట్లకు కోట్లు సంపాదించే ఆటగాళ్లు.. ఇలా కేవలం ట్వీట్లతో సరిపెట్టడం భావ్యం కాదని, డొనేట్‌ చేస్తే బాగుంటుందని కామెంట్‌ చేస్తున్నారు. మీరు చేసే సాయంతో అక్కడి అభాగ్యుల ఉపయోగపడుతుందని వేడుకుంటున్నారు. దయచేసి ట్వీట్‌లు చేయడం మానేసీ విరాళాలు ఇవ్వాలని, అభిమానులు కూడా ఇచ్చేలా చేయాలని కోరుతున్నారు.

>
మరిన్ని వార్తలు